లాస్ ఏంజిల్స్ను కార్చిచ్చు కమ్మేసింది. ఈ ప్రమాదంలో ఇప్పటి వరకు 10 మంది ప్రాణాలు కోల్పోయారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు హెచ్చరిస్తున్నారు. కార్చిచ్చు పసిఫిక్ పాలిసాడ్స్ ప్రాంతాన్ని పూర్తిగా దగ్ధం చేసింది. ఉపగ్రహ చిత్రాల ద్వారా కాలిన ప్రాంతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.
పాలిసాడ్స్లో 5,300 నిర్మాణాలు పూర్తిగా దగ్ధం అయ్యాయి. మొత్తం 9,000 నిర్మాణాలు ధ్వంసం కాగా, మంటల వ్యాప్తి పాలిసాడ్స్లో 20,000 ఎకరాలు, ఈటోన్లో 13,600 ఎకరాలు, కెన్నెత్లో 791 ఎకరాలను మంటలు దహించివేశాయి. కార్చిచ్చు ప్రభావిత ప్రాంతాల నుండి 1.80 లక్షల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. సుమారు 7,500 మంది అగ్నిమాపక, సహాయక సిబ్బంది మంటలను అదుపు చేయడంలో నిమగ్నమయ్యారు.
నష్టం అంచనా
అక్యూవెదర్ అంచనా ప్రకారం ఈ కార్చిచ్చు వల్ల 150 బిలియన్ డాలర్లు (సుమారు రూ. 12 లక్షల కోట్లు) నష్టం వాటిల్లింది. శరవేగంగా వ్యాపిస్తున్న మంటలు తీవ్రమైన గాలుల వల్ల మరింత పెరుగుతున్నాయి. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, దక్షిణ కాలిఫోర్నియాలోని బాధిత కుటుంబాలకు ప్రభుత్వం సాయం అందిస్తోందని, శిథిలాల తొలగింపు పనులు కూడా చేపడతామని ప్రకటించారు.