వరుస వివాదాల్లో మంత్రి.. అనుచ‌రుడిపై మ‌రో ఆరోప‌ణ‌!!

వరుస వివాదాల్లో మంత్రి.. అనుచ‌రుడిపై మ‌రో ఆరోప‌ణ‌!!

పార్వతీపురం మన్యం జిల్లాలో (Parvathipuram Manyam District) మంత్రి గుమ్మడి సంధ్యారాణి (Minister Gummadi Sandhya Rani)అనుచరుల దౌర్జన్యాలు ఒక్కోటిగా వెలుగులోకి వ‌స్తున్నాయి.. తన అనుచరుల ప్రయోజనాల కోసం అధికారాన్ని దుర్వినియోగం చేస్తూ, గ్రామీణ స్థాయిలో ఉద్యోగులను వేధిస్తున్నారన్న ఆరోపణలు తీవ్ర చర్చకు దారితీస్తున్నాయి. ఈ క్రమంలో డి.సిర్లాం గ్రామానికి (D. Sirlam Village) చెందిన ఆశా వర్కర్ విద్యావతి (Vidyavathi) మృతి ఘటన రాజకీయంగా కలకలం రేపుతోంది.

గ్రామ టీడీపీ(TDP) నేత దాకేటి గౌరినాయుడు (Dakati Gourinaidu) తన వారిని ఉద్యోగంలో పెట్టేందుకు ఆశావ‌ర్క‌ర్‌ విద్యావతిపై కుట్రపూరిత చర్యలకు పాల్పడ్డాడని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. విద్యావతికి పక్షవాతం వచ్చిందంటూ గ్రామస్థులతో తప్పుడు ఫిర్యాదు ఇప్పించి ఆమెను ఆశా వర్కర్ ఉద్యోగం నుంచి తొలగించించినట్లు తెలిపారు. అయితే తాను ఆరోగ్యంగా ఉన్నట్లు వైద్య పరీక్షల ద్వారా నిరూపించుకొని, శాఖాపరంగా పోరాటం చేసి జిల్లా వైద్యాధికారి ఆదేశాలతో తిరిగి ఉద్యోగంలో చేరేందుకు అర్హత సాధించింది విద్యావతి.

జిల్లా వైద్యాధికారి ఆదేశాలు ఇచ్చినా, ఏడాది పాటు ఆమెను ఉద్యోగంలో చేరనీయకుండా అడ్డుకున్నాడని టీడీపీ నేత గౌరినాయుడుపై తీవ్ర ఆరోపణలు వినిపిస్తున్నాయి. మంత్రి గుమ్మడి సంధ్యారాణి కాళ్లపై పడి కన్నీళ్లతో వేడుకున్నా ఎలాంటి కనికరం చూపలేదని విద్యావతి కుమార్తె వాపోతున్నారు. ఈ నిరంతర వేధింపులు, అవమానాలతో మానసిక క్షోభకు గురైన విద్యావతి ఏడాది పాటు తీవ్ర ఒత్తిడిని అనుభవించింద‌ని కుటుంబ సభ్యులు చెబుతున్నారు.

చివరకు ఆ మానసిక వేదన గుండెపోటుగా మారి విద్యావతి మృతి చెందిందని ఆరోపిస్తున్నారు. తన తల్లి ఉద్యోగాన్ని అన్యాయంగా కోల్పోయేలా చేసి, మానసిక వేధింపులకు గురిచేసి ఆమె మృతికి కారణమైన టీడీపీ నేత గౌరినాయుడు, అలాగే ఈ వ్యవహారంలో నిర్లక్ష్యం వహించిన పీహెచ్సీ డాక్టర్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని మృతురాలి కుమార్తె జ్యోత్స్న‌ జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేసింది. ఈ ఘటన జిల్లాలో అధికార పార్టీ నేతల వ్యవహారశైలిపై తీవ్ర విమర్శలకు దారితీస్తోంది.

Join WhatsApp

Join Now

Leave a Comment