ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మహిళలపై జరుగుతున్న వరుస దాడులు, అఘాయిత్యాలు ప్రజలను భయాందోళనకు గురిచేస్తున్నాయి. ఒకవైపు పల్నాడు జిల్లాలో ఒంటరి మహిళపై సామూహిక అత్యాచారం వంటి అమానుష ఘటన వెలుగుచూడగా, మరోవైపు బాధితురాలికి న్యాయం చేయాల్సిన చోట అధికార పార్టీ నేతలే దాడులకు దిగుతున్న వీడియోలు రాష్ట్రంలో మహిళల పట్ల జరుగుతున్న దారుణాలకు నిలువుటద్దంగా నిలుస్తున్నాయి.
దాహమని వచ్చి దౌర్జన్యం
మాచర్ల నియోజకవర్గంలో చోటుచేసుకున్న ఈ ఘటన సభ్య సమాజాన్ని తలదించుకునేలా చేసింది. ఇంట్లో ఒంటరిగా ఉన్న ఓ మహిళను లక్ష్యంగా చేసుకున్న దుండగులు, “మంచినీళ్లు కావాలి” అంటూ నమ్మించి లోపలికి ప్రవేశించారు. లోపలికి రాగానే అసలు స్వరూపాన్ని బయటపెట్టి, కత్తితో బెదిరించి ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. తీవ్ర అస్వస్థతకు గురైన బాధితురాలిని స్థానికులు గమనించి వెంటనే నరసరావుపేట ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమెను మెరుగైన చికిత్స కోసం గుంటూరు జీజీహెచ్ (GGH)కు తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి నిందితుల కోసం గాలిస్తున్నారు.
రైల్వే కోడూరులో నడిరోడ్డుపై దాష్టీకం
మహిళలపై సామాన్యులే కాదు, ప్రజాప్రతినిధుల అనుచరులు కూడా రెచ్చిపోతున్నారనే విమర్శలకు రైల్వే కోడూరు ఘటన నిదర్శనంగా నిలుస్తోంది. జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ బాధితురాలు హర్షవీణ, తనకు న్యాయం చేయాలని కోరుతూ ఆందోళన చేస్తుండగా, ఆమెపై నడిరోడ్డుపైనే ఇనుప రాడ్లు, పైపులతో దాడికి పాల్పడ్డారు. బాధ్యత గల స్థానాల్లో ఉన్న నేతలే మహిళలపై నేరాలను ప్రోత్సహిస్తున్నారనే ఆగ్రహం సర్వత్రా వ్యక్తమవుతోంది.
జనసేన ఎమ్మెల్యే బాధితురాలిపై దాడి
— Telugu Feed (@Telugufeedsite) April 3, 2026
నడిరోడ్డుపై బాధిత మహిళ, ఆమెకు కూడా ఉన్న వ్యక్తి గోపిపై దాడి
లాఠీతో దాడి చేసిన జనసేన నేత తాతంశెట్టి నాగేంద్ర https://t.co/2MO4EKdJoS pic.twitter.com/Ihd88Btxl8
వ్యవస్థ విఫలమవుతోందా?
శాంతిభద్రతలను కాపాడాల్సిన చంద్రబాబు ప్రభుత్వం, పోలీసులు, ఇలాంటి అమానుష ఘటనలు జరిగినప్పుడు కఠిన చర్యలు తీసుకోవడంలో విఫలమవుతున్నారనే అభిప్రాయం ప్రజల్లో వ్యక్తమవుతోంది. నిందితులకు తక్షణమే కఠిన శిక్ష పడకపోవడం వల్లే నేరస్థులు బరితెగిస్తున్నారని సామాజిక వేత్తలు హెచ్చరిస్తున్నారు. గతంలో దిశ యాప్, పోలీస్ స్టేషన్ల ద్వారా వెంటనే చర్యలు తీసుకునేవారని గుర్తుచేస్తున్నారు. అధికార పార్టీకి చెందిన వారు దాడులకు పాల్పడినా, సామాన్యులు అఘాయిత్యాలకు ఒడిగట్టినా చట్టం తన పని తాను చేయకపోతే మహిళల భద్రత కేవలం కాగితాలకే పరిమితమవుతుందని ఆవేదన వ్యక్తమవుతోంది.
రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితిపై చంద్రబాబు ప్రభుత్వం తీవ్ర విమర్శలను ఎదుర్కొంటోంది. తక్షణమే ఈ రెండు ఘటనల్లో నిందితులను కఠినంగా శిక్షించి, మహిళలకు భరోసా కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది.








