రాష్ట్రంలో మహిళల రక్షణ కరువైంది. అందుకు నడిరోడ్డుపై నిన్న జరిగిన ఉదంతమే ఒక ఉదాహరణ. అధికార పార్టీ నాయకుడు బాధిత మహిళపై విచక్షణారహితంగా దాడి చేయడం సంచలనంగా మారింది. తిరుపతి జిల్లా రైల్వే కోడూరు నియోజకవర్గంలో స్థానిక జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ బాధితురాలిపై జనసేన నాయకులు, కార్యకర్తలు నడిరోడ్డుపైనే దాడికి పాల్పడటం తీవ్ర కలకలం రేపింది. ఇనుప రాడ్లతో దాడి చేసి, కులం పేరుతో దూషించారన్న ఆరోపణలు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారాయి.
అసలేం జరిగింది?
బాధితురాలు తన అనుచరుడితో కలిసి రైల్వేకోడూరు గాంధీ విగ్రహం సమీపంలో ఉన్న సమయంలో, ఎమ్మెల్యే అరవ శ్రీధర్, జనసేన రాష్ట్ర నాయకుడు తాతంశెట్టి నాగేంద్ర వాహనాలు అక్కడికి చేరుకున్నాయి. ఎమ్మెల్యే కారులో ఉన్నారని భావించిన ఆమె, లోపలికి తొంగి చూసేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో తాతంశెట్టి నాగేంద్ర అనుచరులు ఒక్కసారిగా రెచ్చిపోయి ఆమెపై, ఆమె అనుచరుడిపై ఇనుప రాడ్లతో విచక్షణా రహితంగా దాడి చేశారు. పిడిగుద్దులు కురిపిస్తూ, రక్తం వచ్చేలా కొట్టడమే కాకుండా కులం పేరుతో దూషించారని బాధితురాలు ఆవేదన వ్యక్తం చేశారు. తీవ్ర గాయాలైనప్పటికీ, ఆమె వెనక్కి తగ్గకుండా రోడ్డుపైనే బైఠాయించి తనకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.
“పవన్ కళ్యాణ్ ఆదేశాలనే ధిక్కరిస్తున్నారు”
దాడికి ముందు బాధితురాలు టీడీపీ కార్యాలయంలో నిర్వహించిన ప్రజా దర్బార్లో నియోజకవర్గ ఇన్చార్జ్ ముక్కా రూపానందరెడ్డికి వినతిపత్రం సమర్పించారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆదేశాలను ఎమ్మెల్యే అరవ శ్రీధర్ ఖాతరు చేయడం లేదని ఆరోపించారు. పార్టీ అధికారిక కార్యక్రమాల్లో పాల్గొనవద్దని పవన్ చెప్పినా, ఎమ్మెల్యే బహిరంగంగా పాల్గొంటూ పార్టీని అవమానిస్తున్నారని పేర్కొన్నారు. “న్యాయం కోసం నా పోరాటం ఆపే ప్రసక్తే లేదు” అని ఆమె స్పష్టం చేశారు.
రాజకీయ దుమారం – వైసీపీ డిమాండ్
ఈ ఘటనపై ప్రధాన ప్రతిపక్షం వైసీపీ తీవ్రంగా స్పందించింది. కూటమి ప్రభుత్వంలో మహిళలకు రక్షణ కరువైందని, బాధితులపై పట్టపగలు నడిరోడ్డుపై దాడి జరుగుతున్నా ప్రభుత్వం స్పందించకపోవడం దారుణమని విమర్శించింది. బాధితురాలిపై దాడి చేసిన తాతంశెట్టి నాగేంద్రతో పాటు ఇతర నిందితులను వెంటనే అరెస్ట్ చేయాలని వైసీపీ నేతలు డిమాండ్ చేశారు. బాధితురాలు రైల్వేకోడూరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అధికార పార్టీ ఎమ్మెల్యేపై ఆరోపణలు ఉండటంతో పోలీసులు ఈ కేసును ఎలా డీల్ చేస్తారనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ బాధితురాలిపై దాడి
— Telugu Feed (@Telugufeedsite) April 3, 2026
నడిరోడ్డుపై ఎమ్మెల్యే సమక్షంలోనే హర్షవీణపై లాఠీతో జనసేన నేత తాతంశెట్టి నాగేంద్ర దాడి
అందరూ చూస్తుండగానే మహిళపైకి దూసుకెళ్లిపోయిన నాగేంద్ర
పోలీస్ లాఠీతో దాడి.. https://t.co/i12WyLsTk1 pic.twitter.com/jA2SQA7hz4








