ఆంధ్రప్రదేశ్ కొత్త డీజీపీని ప్రభుత్వం ఖరారు చేసింది. ఉత్తర్వులు ఇవ్వడమే తరువాయి. ప్రస్తుతమున్న డీజీపీ ఈనెలాఖరున ఉద్యోగ విరమణ చేయనున్నారు. కాగా, అసెంబ్లీ ఎన్నికల సమయంలో కీలకంగా వ్యవహరించిన హరీష్కుమార్ గుప్తాను డీజీపీగా ఎంపిక చేసినట్లుగా సమాచారం.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కొత్త డీజీపీగా హరీష్కుమార్ గుప్తా నియమితులయ్యే అవకాశముంది. 1992 బ్యాచ్కు చెందిన ఆయన ప్రస్తుతం విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విభాగం డైరెక్టర్ జనరల్గా సేవలు అందిస్తున్నారు. ప్రస్తుతం డీజీపీగా ఉన్న సీహెచ్ ద్వారకా తిరుమలరావు ఈనెల 31న పదవీ విరమణ చేయనున్న నేపథ్యంలో, హరీష్కుమార్ గుప్తాను ఆ బాధ్యతలకోసం ఎంపిక చేయనున్నట్లు విశ్వసనీయ సమాచారం. రాష్ట్ర ప్రభుత్వం నుంచి అధికారిక ఉత్తర్వులు రావాల్సి ఉంది. తిరుమలరావు ప్రస్తుతం ఆర్టీసీ ఎండీగా అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్నారు. పదవీవిరమణ తర్వాత కూడా ఆయన్ను ఆ పదవిలో కొనసాగించే అవకాశం ఉంది.
సీనియారిటీ జాబితాలో ఎవరు ముందున్నారు?
తిరుమలరావు పదవీ విరమణ అనంతరం సీనియారిటీ జాబితాలో 1991 బ్యాచ్కు చెందిన అగ్నిమాపకశాఖ డైరెక్టర్ జనరల్ మాదిరెడ్డి ప్రతాప్ మొదటి స్థానంలో ఉండగా, హరీష్ గుప్తా రెండో స్థానంలో ఉన్నారు. అయితే అధికార వర్గాల సమాచారం ప్రకారం హరీష్ గుప్తానే కొత్త డీజీపీగా నియమితులయ్యే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.