అనంతపురం జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. గుంతకల్ మండలానికి చెందిన రామాంజనేయులు అనే వ్యక్తి తన కన్న కూతురిని హత్య చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళితే.. గుంతకల్కు చెందిన రామాంజనేయులు కుమార్తె భారతి (19) ఓ యువకుడిని ప్రేమించి పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుంది. అయితే, ఈ విషయం తండ్రి రామాంజనేయులుకు తెలిసింది. కూతురు ప్రేమ విషయంపై తండ్రి రగిలిపోయాడు.
ఈ నేపథ్యంలో, మార్చి 1న భారతిని ఇంట్లోనే ఎవరూ లేని సమయంలో కూతురు భారతిని హత్య చేశాడు. అనంతరం తాను చేసిన నేరం నుంచి తప్పించుకునేందుకు ఆమె మృతదేహాన్ని కసాపురం గ్రామ శివారులోని అటవీ ప్రాంతానికి తీసుకెళ్లి పెట్రోల్ పోసి తగలబెట్టాడు. కొద్ది రోజులుగా భారతి కనిపించకపోవడంతో స్థానికులు, కుటుంబ సభ్యులకు అనుమానం వ్యక్తం చేశారు. దీంతో రామాంజనేయులు నేరాన్ని అంగీకరించి పోలీసుల ఎదుట లొంగిపోయాడు. కసాపురం శివారులో సగం కాలిన స్థితిలో భారతి(19) మృతదేహం లభ్యమైంది. ఈ ఘటన స్థానికంగా తీవ్ర సంచలనం రేపింది. పరువు కోసం కన్న తండ్రే తన కూతురిని బలి తీసుకున్న ఘటనపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.