ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ ధరిస్తే రాష్ట్రంలో రోడ్డు ప్రమాద మరణాల సంఖ్య తగ్గుముఖం పడుతుందని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు అభిప్రాయపడింది. ఇటీవలే ఈ అంశంపై విచారణ చేపట్టిన హైకోర్టు, మూడు నెలలలో 667 మంది ద్విచక్రవాహనదారులు హెల్మెట్ ధరించకపోవడం వల్ల చనిపోవడం పట్ల తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. చట్టాన్ని పాటించని వారికి కఠిన చర్యలు తప్పవని హైకోర్టు హెచ్చరించింది.
పోలీసుల నిర్లక్ష్యం.. నిబంధనల అమలలో వైఫల్యం
పోలీసుల నిర్లక్ష్యాన్ని కూడా హైకోర్టు ప్రస్తావించింది. “పోలీసులు కేవలం చలానాలు వేసి చేతులు దులుపుకుంటే సరిపోదు అని కోర్టు పేర్కొంది. కేవలం జరిమానాలు వసూలు చేయడం కాకుండా, మరింత కఠినమైన చర్యలు అవసరమని సూచించింది. పోలీసులు ప్రజలలో చట్టం గురించి అవగాహన పెంచాల్సిన అవసరం గురించి కూడా ప్రస్తావించింది. ప్రజలకు చట్టాలు గురించి అవగాహన కల్పించడం కూడా అవసరమని హైకోర్టు స్పష్టం చేసింది.
ప్రభుత్వానికి సూచనలు..
విచారణ సందర్భంలో ప్రభుత్వానికి హైకోర్టు పలు కీలక సూచనలు చేసింది. హెల్మెట్ ధరించని వారి కోసం మరింత కఠిన చర్యలు చేపట్టాలని సూచించింది. నగరాల్లో ద్విచక్రవాహదారులందరూ హెల్మెట్ ధరించేలా చర్యలు చేపట్టాలని, హైల్మెట్ లేకుండా బైక్ నడిపితే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేసింది. అదేవిధంగా నిబంధనలపై అవగాహన కల్పించేందుకు చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది.