వైసీపీ నేత, మాజీ మంత్రి కొడాలి నానికి హైకోర్టులో ఊరట లభించింది. విశాఖలో నమోదైన కేసు విషయంలో నానిపై తొందరపాటు చర్యలు తీసుకోవద్దని ధర్మాసనం పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది. 35(3) కింద నోటీసులు ఇచ్చిన తర్వాతే తదుపరి చర్యలు ఉండాలని కోర్టు స్పష్టంగా సూచించింది.
కేసు నేపథ్యం
వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో కొడాలి నాని టీడీపీ నేతలపై అనుచిత వ్యాఖ్యలు చేశారని రాష్ట్రంలోని పలు ప్రాంతాలు కేసులు నమోదయ్యాయి. నవంబర్ 24న విశాఖ త్రీటౌన్ పోలీస్ స్టేషన్లో ఏయూ కాలేజీ విద్యార్థిని ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది. ఆమె తన ఫిర్యాదులో చంద్రబాబు, లోకేశ్పై అనుచిత వ్యాఖ్యలు చేశారని, కొడాలి నాని వ్యాఖ్యలతో తమ మనోభావాలు దెబ్బతిన్నాయని, ఆయనపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.
హైకోర్టులో పిటిషన్
రాష్ట్రంలో వైసీపీ నేతలపై వరుసగా కేసులు, అరెస్టులు జరుగుతున్న నేపథ్యంలో కొడాలి నాని తనపై కూడా అప్రమత్తమై హైకోర్టును ఆశ్రయించారు. విశాఖలో నమోదైన కేసును క్వాష్ చేయాలనే అభ్యర్థనతో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్పై విచారణ చేపట్టిన హైకోర్టు, తొందరపాటు చర్యలు వద్దని పోలీసులకు కీలక ఆదేశాలు ఇచ్చింది.








