బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. దీని ప్రభావంతో నేడు (అక్టోబర్ 21) మరో అల్పపీడనం ఏర్పడి, అది పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ వాయుగుండంగా బలపడే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) వెల్లడించింది. దీని ఫలితంగా ఆంధ్రప్రదేశ్లో వారం రోజులపాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ముఖ్యంగా దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో వర్షాల తీవ్రత ఎక్కువగా ఉంటుందని అంచనా. మత్స్యకారులు వేటకు వెళ్ళరాదని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.
ప్రస్తుతం తూర్పు గోదావరి, కోనసీమ, కృష్ణా, గుంటూరు జిల్లాలతో పాటు రాయలసీమలోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి. ఈరోజు (అక్టోబర్ 21) పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా, ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. వాయుగుండం బలపడే కొద్దీ వర్షాల తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది.
రేపటి నుంచి మూడు రోజులపాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశముంది. అక్టోబర్ 22న బాపట్ల, ప్రకాశం, నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో భారీ వర్షాలు ఉండగా, 23న కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, కృష్ణా, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ వివరించింది.







