ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రైతుల కోసం ఒక పెద్ద కసరత్తు మొదలుపెట్టింది. అన్నదాత సుఖీభవ పథకం పేరుతో ఏడాదికి రైతులకు రూ.20,000 సాయం అందించేందుకు ప్రణాళికలు రూపొందిస్తోంది. ఈ పథకం కింద, PM కిసాన్ నిధులు ఎప్పుడు విడుదలైతే, అదే సమయానికి రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ పథకాన్ని అమలు చేయాలని నిర్ణయించింది.
ప్రస్తుతం PM కిసాన్ పథకం కింద రైతులకు కేంద్రం రూ.6,000 అందిస్తుండగా, దీన్ని రూ.10,000కు పెంచింది. అదనంగా, రాష్ట్ర ప్రభుత్వం కూడా రూ.10,000 చొప్పున అందించి, మొత్తం రూ.20,000గా చేయనున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిన్న జరిగిన కేబినెట్ భేటీలో వెల్లడించారు. కేంద్రం 3 విడతల్లో ఎంత మొత్తం ఇస్తే, అదే విధంగా రాష్ట్రం కూడా తగిన నిధులు అందించనుంది.
ఈ నిర్ణయం కారణంగా కూటమి ప్రభుత్వంపై రైతు సంఘాల నుంచి విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. సూపర్ సిక్స్లో భాగంగా ఎన్నికల మేనిఫెస్టోలో రైతులకు ఏటా రూ.20వేల సాయం అని ప్రకటించిన చంద్రబాబు.. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం నుంచి రైతులకు వచ్చే నిధులను కలుపుకొని ఇస్తానని ప్రకటించడంతో రైతు సంఘాల ప్రతినిధులు భగ్గుమంటున్నారు. కేంద్రం పీఎం కిసాన్ నిధులతో సంబంధం లేకుండా రూ.20 వేల సాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు.
కూటమి ప్రభుత్వం అమలు చేయదలిచిన పథకం రైతుల ఆర్థిక స్థితిని బలోపేతం చేస్తుందా? రైతులకు ఇది ఉపయుక్తమవుతుందా? అన్నదాతల జీవన ప్రమాణాలను మెరుగుపరచడంలో ఈ పథకం ఎంత మేరకు సహాయపడుతుందో చూడాలి.








