కూటమి ప్రభుత్వం (Coalition Government) విద్యుత్ వినియోగదారులప మరో 12,771 కోట్లు విద్యుత్ (Electricity) భారం మోపెందుకు సిద్ధమవుతోందని, తక్షణం భారాన్ని ఉపసంహరించుకోవాలని సీపీఎం(CPM) డిమాండ్ చేసింది. కూటమి ప్రభుత్వం మరోసారి విద్యుత్ వినియోగదారులపై భారాన్ని మోపేందుకు సిద్ధమవుతున్న నేపథ్యంలో సీపీఎం పార్టీ తీవ్రంగా స్పందించింది. ఇప్పటికే 2024-25 సంవత్సరానికి ప్రతినెల యూనిట్(Unit)కు 40 పైసల చొప్పున రూ.2,787 కోట్ల భారాన్ని ప్రజలపై మోపిన ప్రభుత్వం.. మళ్లీ రూ.12,771 కోట్లను ప్రజల జేబుల నుంచి లాక్కోవాలని చూడడం దారుణమని సీపీఎం పేర్కొంది. ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ సీపీఎం బహిరంగ లేఖను విడుదల చేసింది.
గతంలో విద్యుత్ ఛార్జీలు (Electricity Charges) పెంచబోమని హామీ ఇచ్చిన కూటమి పార్టీలు, అధికారం చేపట్టిన తర్వాత వరుసగా ప్రజలపై ట్రూ అప్, సర్దుబాటు చార్జీల పేరుతో భారాలు మోపుతున్నాయని ఆరోపించింది. గతంలో 2014-19 కాలానికి సంబంధించిన 36 నెలల్లో రూ.3 వేల కోట్లు ట్రూ అప్ చార్జీలు వసూలు చేశారని, మళ్లీ కూటమి అధికారంలోకి రాగానే రూ.15 వేల కోట్ల భారాన్ని ప్రజలపై మోపిందని గుర్తుచేసింది. ఇదీ చాలదన్నట్లు మరో రూ.12 వేల కోట్ల భారాన్ని ప్రజలపై మోపేందుకు ప్రయత్నిస్తోందని, తక్షణమే కూటమి ప్రభుత్వం తన నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని సీపీఎం డిమాండ్ చేసింది.
విద్యుత్ ఛార్జీల పెంపు, ట్రూ అప్, ఇంధన సర్దుబాటు చార్జీలు, స్మార్ట్ మీటర్ల అమలు వంటి ప్రతికూల నిర్ణయాలను వ్యతిరేకిస్తూ ఆగష్టు 5న రాష్ట్రవ్యాప్తంగా ధర్నాలు నిర్వహించనున్నట్లు సీపీఎం ప్రకటించింది. ప్రజలందరూ పెద్దఎత్తున పాల్గొని ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చింది. ప్రజల జీవన భారాన్ని తగ్గించే బదులు, దానిపై మరింత భారం పెడుతున్న కూటమి ప్రభుత్వానికి ఇది గుణపాఠంగా ఉండాలని హెచ్చరించింది.