ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఈరోజు కీలక బిల్లుకు ఆమోదం తెలిపింది. అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైన వెంటనే వ్యోమగామి సునీత విలియమ్స్కు అభినందనలు తెలియజేసింది శాసనసభ. ఆమె జీవితం స్ఫూర్తిదాయకమని స్పీకర్ అయ్యన్నపాత్రుడు వ్యాఖ్యానించారు.
అనంతరం ప్రశ్నోత్తరాల సమయం (Question Hour) ప్రారంభమైంది. ఈ సమయంలో సంచార పశువైద్యశాలలు, విశాఖ స్టీల్ ప్లాంట్ భూముల పరివర్తన, అత్యవసర వైద్య సేవలపై చర్చ జరిగింది. సంచార పశువైద్యశాలల వ్యవహారంలో గత ప్రభుత్వ హయాంలో అవినీతి జరిగిందని సభ్యులు ఆరోపించారు. దీనిపై మంత్రి అచ్చంనాయుడు స్పందిస్తూ, పూర్తి స్థాయి విచారణ జరిపిస్తామని హామీ ఇచ్చారు.
ద్రవ్య వినిమయ బిల్లు – ప్రభుత్వ స్పష్టత
ఇక, ఆంధ్రప్రదేశ్లో మెరుగైన వైద్య సేవలపై కూడా అసెంబ్లీలో చర్చ సాగింది. రాష్ట్రంలో క్యాన్సర్ కేర్ సెంటర్లు, ట్రామా సెంటర్లు అందుబాటులో ఉన్నాయని మంత్రి సత్యకుమార్ తెలిపారు. అయితే ఇంకా మెరుగైన వైద్య సేవలు అందించడానికి ప్రభుత్వం కృషి చేస్తోందని స్పష్టం చేశారు.
అంతేకాక, ఉపాధ్యాయ బదిలీల క్రమబద్ధీకరణ బిల్లు కూడా అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. గతంలో బదిలీల్లో పారదర్శకత లేకపోవడంతో అవకతవకలు చోటుచేసుకున్నాయని మంత్రి నారా లోకేష్ తెలిపారు. ఇకపై ఉపాధ్యాయ బదిలీలలో పూర్తిస్థాయి పారదర్శకత తీసుకురావడమే లక్ష్యంగా ఈ బిల్లును తీసుకొచ్చామని ఆయన వివరించారు.
ఈ రోజు ద్రవ్య వినిమయ బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. ఇప్పటికే బడ్జెట్పై చర్చ ముగిసినందున దీనిపై ప్రత్యేకమైన చర్చ అవసరం లేదని ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ వెల్లడించారు. ఈ బిల్లు ఆమోదం పొందడంతో ఏప్రిల్ 1 నుంచి జీతాలు, బిల్లుల చెల్లింపులు సాఫీగా కొనసాగనున్నాయి. అనంతరం అసెంబ్లీ రేపటికి వాయిదా పడింది.