పాడేరు జిల్లా జి.మాడుగుల మండలంలో బాలికను కిడ్నాప్ చేసి ఆమెపై అఘాయిత్యానికి పాల్పడిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కృష్ణా జిల్లా మచిలీపట్నంలో మైనర్ బాలికపై నలుగురు వ్యక్తులు సామూహిక అత్యాచారానికి పాల్పడిన ఘటన మరువక ముందే మరో సంఘటన వెలుగు చూడడం అందరినీ ఆందోళనకు గురిచేస్తోంది.
ఈనెల 25న స్థానిక ఆశ్రమ పాఠశాలలో చదువుకుంటున్న ఓ బాలిక అదృశ్యమైంది. దీంతో ఆందోళనకు గురైన తల్లిదండ్రులు వెంటనే పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు 28న బాలిక ఆచూకీని కనుగొన్నారు. పోలీసు విచారణలో అదృశ్యమైన బాలిక తనపై జరిగిన ఘోరమైన దాడి గురించి వివరించింది.
ముగ్గురు వ్యక్తులు ఆమెను మాయమాటలు చెప్పి కిడ్నాప్ చేసి, లైంగిక దాడికి పాల్పడినట్లు వివరించింది. ఈ ఘోరమైన చర్యకు పాల్పడిన నిందితులను అరెస్ట్ చేసేందుకు పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. ఇందులో ఒక వ్యక్తిని ఇప్పటికే అరెస్ట్ చేయగా, మిగిలిన ఇద్దరు నిందితుల కోసం గాలింపు కొనసాగుతోంది. బాలికను తల్లిదండ్రుల దగ్గరకు చేరవేశారు. రాష్ట్రంలో మైనర్ బాలికపై జరుగుతున్న అఘాయిత్యాలు తల్లిదండ్రులను ఆందోళనకు గురిచేస్తున్నాయి. ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరిపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.








