ఏపీని కుదిపేస్తున్న ములకలచెరువు కల్తీ మద్యం కేసులో తవ్వే కొద్ది షాకింగ్ విషయాలు బయటపడుతున్నాయి. కల్తీ మద్యం కేసులో ఒక్కొ అరెస్ట్తో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా ఈ కేసులో తంబళ్లపల్లె టీడీపీ మాజీ ఇన్చార్జ్ జయచంద్రారెడ్డి డ్రైవర్ అష్రఫ్ ఎక్సైజ్ అధికారుల విచారణలో పలు కీలక వివరాలను బయటపెట్టాడు.
నకిలీ మద్యం సరఫరా
విచారణలో అష్రఫ్ వెల్లడించిన వివరాల ప్రకారం.. టీడీపీ మాజీ ఇన్చార్జ్ జయచంద్రారెడ్డి కి చెందిన బ్లాక్ స్కార్పియో వాహనంలో నకిలీ మద్యం బెల్ట్ షాపులకు సరఫరా చేసేవారని తెలిపారు. ఈ వాహనం ద్వారా జిల్లాలోని పలు ప్రాంతాలకు నకిలీ మద్యం తరలింపులు జరిగాయని అంగీకరించాడు. టీడీపీ ఇన్చార్జ్ కావడంతో తన వెహికిల్ను అయితే ఎవరూ ఆపరనే ధీమాతో కల్తీ మద్యాన్ని సరఫరా చేసినట్లుగా తెలుస్తోంది. అయితే ఇది పూర్తిగా రాజకీయ ప్రభావంతో సాగిందని అధికారులు అనుమానిస్తున్నారు.
జయచంద్రారెడ్డి పీఏ రాజేష్ ఆధ్వర్యంలో, ములకలచెరువులోని రాక్ స్టార్ వైన్స్ నుంచి నకిలీ మద్యం స్టాక్ సేకరించి, బెల్ట్ షాపులకు తరలించేవారని అష్రఫ్ తన రిమాండ్ రిపోర్ట్లో పేర్కొన్నాడు. ఈ రవాణా వ్యవస్థలో మరికొందరు టీడీపీ నాయకుల ప్రమేయం ఉన్నట్లు ఎక్సైజ్ అధికారులు అనుమానిస్తున్నారు. కల్తీ మద్యం సరఫరా చేసినందుకు ఈ కేసులో ఏ1గా ఉన్న జనార్దన్రావు అష్రఫ్కు రోజుకు రూ.800 ఇచ్చినట్లుగా తెలుస్తోంది.
ఈ కేసులో అరెస్టైన కట్టా నాగరాజు వద్ద నుంచి స్వాధీనం చేసుకున్న ల్యాప్టాప్, డైరీలలో భారీ ఆర్థిక లావాదేవీల వివరాలు దొరికాయని పోలీసులు తెలిపారు. ఈ లావాదేవీలు నకిలీ మద్యం విక్రయాల ద్వారా వచ్చిన డబ్బుతో సంబంధం ఉన్నట్లు భావిస్తున్నారు. మొత్తం కేసులో కీలక నాయకుల పేర్లు వెలుగులోకి వచ్చే అవకాశాలు ఉన్నాయని ఎక్సైజ్ అధికారులు చెబుతున్నారు.





 



