ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) ఆర్థిక పరిస్థితి (Financial Situation) మరోసారి చర్చనీయాంశమైంది. చంద్రబాబు ప్రభుత్వం (Chandrababu Government) రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) సెక్యూరిటీల వేలం ద్వారా తాజాగా రూ. 3,000 కోట్ల అప్పు తీసుకువచ్చింది. ప్రతి మంగళవారం మాదిరిగానే ఈ మంగళవారం (Tuesday) కూడా రూ.3000 కోట్ల అప్పు తీసుకొచ్చింది.
ప్రస్తుత ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆర్థిక అవసరాల కోసం అప్పులపైనే ఎక్కువగా ఆధారపడుతోందని తాజా నివేదికలు చెబుతున్నాయి. అధికారంలోకి వచ్చిన ఈ 21 నెలల కాలంలో బడ్జెట్ అప్పులు గణనీయంగా పెరిగాయి. బడ్జెట్ అప్పులతో పాటు కార్పొరేషన్ల ద్వారా తెచ్చిన అప్పులు కలుపుకుంటే తాజాగా చేసిన రూ.3 వేల కోట్లతో కలుపుకుంటే రాష్ట్ర అప్పులు రూ. 3,30,000 కోట్లు దాటిపోయినట్లు అంచనా. బడ్జెట్ అప్పులు (Budget Borrowings) రూ. 1,82,264 కోట్లకు చేరాయి.
ఆర్బీఐ సెక్యూరిటీల ద్వారా అప్పులు చేయడంలో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే అగ్రస్థానాల్లో ఒకటిగా (Andhra Pradesh Top Positions in the Country) నిలుస్తోందని ఆర్థిక విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఎఫ్ఆర్బీఎం (FRBM) పరిమితిని మించి రాష్ట్రం అప్పులు చేస్తోందని, ఇది భవిష్యత్తులో రాష్ట్ర ఖజానాపై తీవ్రమైన వడ్డీ భారానికి దారితీస్తుందని విపక్షాలు విమర్శిస్తున్నాయి. కేవలం బడ్జెట్ కేటాయింపులే కాకుండా, కార్పొరేషన్ల ద్వారా బడ్జెట్ వెలుపల (Off-budget borrowings) కూడా భారీగా నిధులను సేకరిస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి.
ఎందుకీ అప్పులు?
రాష్ట్ర ప్రభుత్వం తన రోజువారీ ఖర్చులు, ఉద్యోగుల జీతభత్యాలు, పెన్షన్లు మరియు అమలు చేస్తున్న వివిధ సంక్షేమ పథకాలకు నిధుల సర్దుబాటు కోసం ఈ రుణాలను వినియోగిస్తోంది. అయితే, మూలధన వ్యయం (Capital Expenditure) కంటే రెవెన్యూ వ్యయం (Revenue Expenditure) కోసమే ఎక్కువ అప్పులు చేయాల్సి రావడం ఆందోళన కలిగిస్తోందని ఆర్థిక నిపుణులు అంటున్నారు. లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేసినా, ప్రజలకు సంక్షేమ పథకాల రూపంలో ఇచ్చిందేమీ లేదని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి.








