గత వైసీపీ ప్రభుత్వం (YSRCP Government) ఏపీ(AP)లోని 13 జిల్లాలను 26 జిల్లాలుగా మార్చింది. ప్రజల వినతులు, పరిపాలన సౌలభ్యానికి అనుగుణంగా కొత్త జిల్లాలను ఏర్పాటు చేశారు. కూటమి ప్రభుత్వం (Coalition Government) అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన జిల్లాల్లో మార్పులకు పూనుకుంది. ఈ నేపథ్యంలో ఒక కేబినెట్ సబ్ కమిటీని నియమించింది.
అమరావతి (Amaravati)లోని సచివాలయం (Secretariat)లో బుధవారం జరిగిన మంత్రివర్గ ఉపసంఘం సమావేశంలో కొత్త జిల్లాలు, రెవెన్యూ డివిజన్ల ఏర్పాటుపై కీలక చర్చ జరిగింది. ఇప్పటికే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) ఆదేశాలతో కేబినెట్ సబ్ కమిటీ ముందస్తు సమీక్షలు పూర్తి చేసింది. ఆ వివరాల ఆధారంగా జిల్లాల పునర్విభజన, మండలాలు మరియు గ్రామ సరిహద్దుల మార్పు అంశాలపై చర్చ సాగింది.
సమావేశంలో మదనపల్లె (Madanapalle), మార్కాపురం (Markapuram) కేంద్రాలుగా కొత్త జిల్లాల ఏర్పాటుకు ప్రతిపాదనలు ఉంచగా, అదనంగా పీలేరు, అద్దంకి, గిద్దలూరు, మడకశిర ప్రాంతాల్లో కొత్త రెవెన్యూ డివిజన్ల ఏర్పాటు అంశాన్ని మంత్రులు పరిశీలించారు. అలాగే, నూజివీడు, గన్నవరం నియోజకవర్గాలను ఎన్టీఆర్ జిల్లాలో కలపడంపై కూడా సవివరంగా చర్చించారు. ప్రజల సౌకర్యం, పరిపాలన సామర్థ్యం దృష్ట్యా సరిహద్దు మార్పులపై తుది నిర్ణయం తీసుకునే దిశగా చర్చలు కొనసాగాయి.
మంత్రులు సరిహద్దు మార్పులకు సంబంధించి ప్రాంతాల వారీగా నివేదికను సిద్ధం చేయాలని నిర్ణయించారు. ఈ నివేదికను ముఖ్యమంత్రికి సమర్పించి, తుది ఆమోదం కోసం మంత్రివర్గానికి పంపనున్నారు. వచ్చే 10న జరగనున్న కేబినెట్ సమావేశంలో జిల్లాల పునర్విభజన అంశం చర్చకు రానుంది. మంత్రివర్గ ఉపసంఘం నివేదిక ఆధారంగా కొత్త జిల్లాలు, రెవెన్యూ డివిజన్ల ఏర్పాటుపై తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లు సమాచారం.








