ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh)లో సంచలనం రేపుతున్న మద్యం కేసు (Liquor Case)లో రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ధనుంజయరెడ్డి (Dhanunjaya Reddy), మాజీ సీఎం జగన్మోహన్రెడ్డి ఓఎస్డీ కృష్ణమోహన్రెడ్డి (Jagan Mohan Reddy) ని సిట్ (SIT – Special Investigation Team) అధికారులు శుక్రవారం రాత్రి అరెస్టు (Arrest) చేశారు. మూడు రోజుల పాటు సుదీర్ఘ విచారణ అనంతరం ఈ అరెస్టులు జరిగాయి. సిట్ అధికారులు వీరిని శనివారం ఉదయం వైద్య పరీక్షల తర్వాత ఏసీబీ కోర్టు (ACB Court) లో హాజరు పరిచే అవకాశం ఉంది. మే 14 నుంచి మూడు రోజుల పాటు సిట్ అధికారులు ధనుంజయరెడ్డి, కృష్ణమోహన్రెడ్డిని విజయవాడలోని సిట్ కార్యాలయంలో విచారించారు. విచారణలో మద్యం విధానం రూపకల్పన, సరఫరా వంటి అంశాలపై ప్రశ్నలు వేసినట్లు తెలుస్తోంది. సిట్ చీఫ్, విజయవాడ పోలీస్ కమిషనర్ ఎస్వీ రాజశేఖర్బాబు (SV Rajasekhar Babu) నేతృత్వంలో ఈ విచారణ జరిగింది.
అరెస్టులపై వివాదం
ధనుంజయరెడ్డి, కృష్ణమోహన్రెడ్డి తరపు న్యాయవాది సుదర్శన్ రెడ్డి (Sudarshan Reddy) ఈ అరెస్టులను కక్షపూరితమైనవిగా అభివర్ణించారు. ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను అరెస్టు చేసే సంస్కృతి సరైనది కాదని, ఇది రాజకీయ ఒత్తిడితో జరిగిన చర్యగా ఆయన ఆరోపించారు. వైసీపీ నేత, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ (Botsa Satyanarayana) కూడా ఈ అరెస్టులను రాజకీయ కక్షసాధింపు చర్యలుగా విమర్శించారు. చంద్రబాబు (Chandrababu) చేస్తున్న కక్ష రాజకీయాల (Faction Politics) వల్ల వ్యవస్థలు దెబ్బతింటున్నాయని, తప్పుడు కేసులు పెట్టి తప్పుడు సాక్ష్యాలు, వాంగ్మూలాలు సృష్టిస్తున్నారన్నారు. ప్రభుత్వాధికారులను, మాజీ ప్రభుత్వాధికారులపై కూడా రాజకీయ విరోధం చూపిస్తున్నారని వైసీపీ సీనియర్ నేత బొత్స వ్యాఖ్యానించారు. మరోవైపు, సిట్ అధికారులు ఈ కేసులో ధనుంజయరెడ్డి, కృష్ణమోహన్రెడ్డితో పాటు భారతి సిమెంట్స్ డైరెక్టర్ గోవిందప్ప బాలాజీ (Govindappa Balaji) ని కూడా ఇప్పటికే అరెస్టు చేసిన విషయం తెలిసిందే.
జగన్ టార్గెట్గా లిక్కర్ కేసు..
మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి (YS Jagan Mohan Reddy) టార్గెట్ (Target)గా కూటమి మద్యం కేసును తెరపైకి తెచ్చిందని, లేని కేసును సృష్టించి ఒకరిని అరెస్టు చేసి.. ఆ తరువాత జగన్కు దగ్గరగా ఉన్న వ్యక్తులను లక్ష్యంగా చేసుకొని అరెస్టులకు పాల్పడుతున్నారని వైసీపీ (YSRCP) మండిపడుతోంది. లిక్కర్ కేసు అంశంపై సోషల్ మీడియాలోనూ ప్రభుత్వానికి వ్యతిరేక స్వరాలు వినిపిస్తున్నాయి. జగన్ను అరెస్టు చేయడం కోసమే ఈ కేసును సృష్టించినట్లుగా నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. ప్రభుత్వం ప్రతీకార రాజకీయాలకు పాల్పడుతోందని, జగన్ను ఎంత తొక్కాలని చూస్తే కూటమికి అంతే ప్రమాదమని, నేలకు కొట్టిన బంతిలా అంతే స్పీడ్గా జగన్ ఉవ్వెత్తున ఎగసిపడతాడని సోషల్ మీడియాలో వైసీపీ శ్రేణులు కామెంట్లు చేస్తున్నారు.
కేసు కీలక దశలో ఉందన్న లూథ్రా
ధనుంజయరెడ్డి, కృష్ణమోహన్రెడ్డి తమకు మద్యం విధానంతో ఎలాంటి సంబంధం లేదని, ఈ అంశం ఎక్సైజ్ శాఖ, బెవరేజస్ కార్పొరేషన్కు సంబంధించినదని సిట్ విచారణలో స్పష్టం చేసినట్లు సమాచారం. అయినప్పటికీ, సిట్ అధికారులు ఒకే రకమైన ప్రశ్నలను పదేపదే వేసినట్లు తెలుస్తోంది. ఈ కేసులో ముందస్తు బెయిల్ కోసం ధనుంజయరెడ్డి, కృష్ణమోహన్రెడ్డి సుప్రీం కోర్టును ఆశ్రయించగా శుక్రవారం ఉదయం జస్టిస్ జేబీ పార్దీవాలా ధర్మాసనం వారి పిటిషన్లను తిరస్కరించింది. కేసు కీలక దశలో ఉందని ప్రభుత్వం తరఫున న్యాయవాది సిద్ధార్థ లూథ్రా చెప్పడంతో.. దర్యాప్తు కీలక దశలో ఉన్నందున ముందస్తు బెయిల్ ఇవ్వడం సాధ్యం కాదని పేర్కొంది.
అబద్ధపు వాంగ్మూలం ఇవ్వాలని ఒత్తిడి
అయితే, ధనుంజయరెడ్డి, కృష్ణమోహన్రెడ్డి తమపై నమోదైన కేసు అక్రమమైనదని, మద్యం విధానంతో తమకు సంబంధం లేదని వాదిస్తున్నారు. సిట్ అధికారులు తమను మానసికంగా వేధించారని, అబద్ధపు వాంగ్మూలం ఇవ్వాలని ఒత్తిడి చేశారని వారు ఆరోపించారు. మద్యం కుంభకోణం కేసు ఆంధ్రప్రదేశ్లో రాజకీయంగా సున్నితమైన అంశంగా మారింది. ఈ అరెస్టులు రాజకీయ కక్షసాధింపు చర్యలని వైసీపీ ఆరోపిస్తుండగా, సిట్ మాత్రం దర్యాప్తు కీలక దశలో ఉందని, నిందితుల పాత్రపై స్పష్టమైన ఆధారాలు ఉన్నాయని పేర్కొంటోంది. కోర్టు తదుపరి విచారణలో ఈ కేసు మరిన్ని వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.