ఆంధ్రప్రదేశ్ పోలీసుల (Andhra Pradesh Police)పై హైకోర్టు (High Court) ఆగ్రహం వ్యక్తం చేసింది. ఒక వ్యక్తిని అరెస్టు చేసిన సమయాన్ని కోర్టుకు తప్పుగా నివేదిస్తారా..? అని మండిపడింది. గతంలోనూ మాదిగ మహాసేన వ్యవస్థాపకుడు ప్రేమ్ కుమార్ (Prem Kumar) అరెస్టు విషయంలో సీరియస్ అయిన గౌరవ న్యాయస్థానం (Judiciary).. తాజాగా సోమవారం వైసీపీ (YSRCP) సోషల్ మీడియా యాక్టివిస్ట్ వర్రా రవీందర్రెడ్డి (Varra Ravinder Reddy) కేసులోనూ కీలక వ్యాఖ్యలు చేసింది.
సోషల్ యాక్టవిస్టు వర్రా రవీందర్ రెడ్డి కేసులో పోలీసు అధికారులపై హైకోర్టు సీరియస్ అయ్యింది. అరెస్టు సమయం, తేదీపై కోర్టుకు తప్పుడు అఫడివిట్లు ఇవ్వడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. సీసీ ఫుటేజీ ఆధారంగా పోలీసులు వేసిన అఫిడవిట్లలో సమాచారం తప్పుగా ఉందని తేల్చింది. 2024 నవంబర్ 8న వర్రా రవీందర్ను అరెస్టు చేసిన పోలీసులు.. నవంబర్ 10న అరెస్టు చేశామని ఎలా చెప్తారంటూ హైకోర్టు మండిపడింది. బాధ్యులైన అధికారులు తాము తీసుకోబోయే చర్యలకు సిద్ధంగా ఉండాలని హైకోర్టు సూచించింది. ఈ మేరకు ప్రభుత్వ న్యాయవాదికి ఆదేశాలు జారీ చేసింది.
ప్రేమ్ కుమార్ కేసులోనూ..
గతంలో మాదిగ మహాసేన వ్యవస్థాపకుడు ప్రేమ్కుమార్ అరెస్టు విషయంలోనూ హైకోర్టు ఏపీ పోలీసులపై సీరియస్ అయ్యింది. పోలీసులు చాలా క్యాజువల్గా కేసులు పెట్టి, వాంగ్మూలాలు సృష్టిస్తున్నారని వ్యాఖ్యానించడం గమనార్హం. పోలీసుల వ్యవహార శైలి చూస్తుంటే తమకు బ్లడ్ ప్రెజర్ (బీపీ) పెరిగిపోతోందని ఏపీ హైకోర్టు ధర్మాసనం వ్యాఖ్యానించడం గతంలో చర్చనీయాంశంగా మారింది. కేసుల విషయంలో పోలీసులు కొత్త కొత్త విధానాలను కనిపెడుతున్నారని, ప్రభుత్వ పెద్దల మెప్పు కోసం పని చేయొద్దని, పరిధి దాటి పనిచేస్తే.. భవిష్యత్తులో ఏదైనా సమస్య వస్తే ఎవరూ మిమ్మల్ని కాపాడరని సున్నితంగా హెచ్చరించిన విషయం తెలిసిందే.