కూటమి ప్రభుత్వం నేడు అనంతపురంలోని ఇంద్రప్రస్థ నగర్లో భారీ బహిరంగ సభ నిర్వహిస్తోంది. ‘సూపర్ సిక్స్ – సూపర్ హిట్’ పేరిట జరుగుతున్న ఈ సభలో 15 నెలల్లో తీసుకున్న నిర్ణయాలు, అభివృద్ధి అంశాలపై ప్రజలకు వివరణ ఇవ్వనున్నారు. అధికారంలోకి వచ్చాక మూడు పార్టీలు కలిసి నిర్వహిస్తున్న ఇది తొలి సభ కావడంతో ఆ పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నెలకొంది. సభకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, బీజేపీ నేత మాధవ్, పలువురు మంత్రులు హాజరుకానున్నారు.
ఆర్టీజీఎస్ కు లోకేష్..
అయితే, ఈ సభలో పాల్గొనాల్సిన మంత్రి నారా లోకేష్ తన అనంతపురం పర్యటనను రద్దు చేసుకున్నారు. నేపాల్లో చిక్కుకున్న ఆంధ్రప్రదేశ్ ప్రజలను సురక్షితంగా తిరిగి తీసుకురావడం కోసం ప్రత్యేక వార్ రూమ్ను ఏర్పాటు చేశారు. మంత్రులు, అధికారులతో సమన్వయం చేస్తూ, ఆర్టీజీఎస్ సెంటర్లో కాల్ సెంటర్, వాట్సాప్ నెంబర్ ద్వారా సమాచారం సేకరించనున్నారు. నేపాల్లో చిక్కుకున్న ఏపీ ప్రజల వివరాలను సేకరించి, కేంద్రం సహకారంతో వారిని రాష్ట్రానికి తీసుకురావడానికి చర్యలు చేపడుతున్నారు.