కేంద్ర హోంమంత్రి అమిత్ షా (Amit Shah) తమిళ ప్రజలకు బహిరంగ క్షమాపణలు చెప్పడం రాజకీయాల్లో సంచలనం రేపుతోంది. జాతీయ విద్యా విధానం (NEP)పై తమిళనాడు ప్రభుత్వం- కేంద్రం మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. ఈ సమయంలో కోయంబత్తూర్లో జరిగిన ఓ కార్యక్రమంలో అమిత్ షా తమిళ ప్రజలకు క్షమాపణలు చెప్పడం సంచలనంగా మారింది. “ప్రపంచంలో అతి ప్రాచీన భాష తమిళం. అలాంటి గొప్ప భాషలో మాట్లాడలేకపోతున్నందుకు తమిళ ప్రజలు నన్ను క్షమించాలి” అంటూ అమిత్ షా వ్యాఖ్యానించారు.
2024 ఎన్నికలపై అమిత్ షా విశ్వాసం
బహిరంగ సభలో అమిత్ షా మాట్లాడుతూ.. వచ్చే ఎన్నికల్లో తమిళనాడులో డీఎంకే (DMK) ఓటమి పాలై, ఎన్డీఏ (NDA) ప్రభుత్వం ఏర్పాటు అవుతుందని ధీమా వ్యక్తం చేశారు. 2024 ఏడాది బీజేపీ చరిత్రలో మారుపురాని సంవత్సరం అని ప్రకటించారు. ఏపీ, హరియాణా, మహారాష్ట్ర, ఢిల్లీ ప్రజలు తమపై సంపూర్ణ నమ్మకంతో అధికారం కట్టబెట్టారని, భవిష్యత్తులో అదే విశ్వాసాన్ని నిలబెట్టుకుంటామని అన్నారు.
జాతీయ విద్యా విధానం (NEP) ప్రకారం విద్యార్థులు హిందీ, ఇంగ్లీష్, ఒక స్థానిక భాష తప్పనిసరిగా నేర్చుకోవాలని కేంద్రం త్రిభాషా విధానాన్ని ప్రవేశపెట్టింది. అయితే తమిళనాడు ప్రభుత్వంతో పాటు అక్కడి ప్రజలు, బీజేపీ మినహా రాజకీయ పార్టీలు ఏకమై కేంద్ర విధానాన్ని తప్పుబట్టారు. ద్విభాషా విధానానికే కట్టుబడి ఉంటామని, హిందీ బలవంతంగా రుద్దితే ఊరుకోమని స్పష్టంచేశారు. ఈ నేపథ్యంలో అమిత్ షా తమిళులకు క్షమాపణలు చెప్పడంతో చర్చనీయాంశంగా మారింది.