అమరావతి (Amaravati) రైతుల (Farmers) నుంచి కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ (Pemmasani Chandrasekhar), టీడీపీ(TDP) ఎమ్మెల్యే తెనాలి శ్రవణ్ కుమార్ (Tenali Sravan Kumar)లకు నిరసన సెగ ఎదురైంది. మందడం గ్రామంలో రాజధాని కోసం భూములు ఇచ్చిన రైతు రామారావు (Rama Rao) శుక్రవారం మంత్రి నారాయణ(Minister Narayana) ఎదుట ఆవేదన వ్యక్తం చేస్తూ కుప్పకూలి మృతిచెందాడు. కుటుంబాన్ని పరామర్శించేందుకు కేంద్రమంత్రి, టీడీపీ ఎమ్మెల్యే వెళ్లడంతో ఉద్రిక్తత చోటుచేసుకుంది. తెలుగుదేశం పార్టీ నేతలతో కలిసి వెళ్లిన కేంద్రమంత్రి, ఎమ్మెల్యేలను చూసిన వెంటనే రామారావు కుటుంబ సభ్యులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
“ఎవరికోసం వచ్చారు..? చంపేయడానికి వస్తారా?” అంటూ మృతుడు రామారావు బామ్మర్ది కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, ఎమ్మెల్యే తెనాలి శ్రవణ్ కుమార్ను నిలదీశారు. మీ సానుభూతి మాకు అవసరం లేదని, ఎమ్మెల్యే తెనాలి శ్రవణ్ కుమార్ వల్లే మా బావ చనిపోయాడు అంటూ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.
“ముమ్మాటికి మా బావ ఎమ్మెల్యే శ్రవణ్ కుమార్ కారణంగానే ప్రాణాలు కోల్పోయాడు” అంటూ రామారావు బావమరిది ఆరోపించారు. చనిపోయిన వ్యక్తిని తిరిగి తీసుకురాగలరా అంటూ కేంద్ర మంత్రి, ఎమ్మెల్యేలను ప్రశ్నించారు. “దేనికి వచ్చారు..? మళ్లీ చంపడానికి వచ్చారా?” అంటూ కుటుంబ సభ్యులు ఆగ్రహంతో నిలదీశారు.
కుటుంబ సభ్యుల ఆగ్రహం తీవ్రస్థాయికి చేరడంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. “మీ సానుభూతి మాకెందుకు?” అంటూ కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్ కుమార్పై కుటుంబ సభ్యులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ ఘటన అక్కడ ఉన్నవారిని కలవరపాటుకు గురిచేసింది.
రాజధాని భూములు ఇచ్చిన రైతు రామారావు మృతి చుట్టూ ఇప్పటికే రాజకీయ వాతావరణం వేడెక్కిన నేపథ్యంలో, ఈ ఘటనతో మందడం గ్రామంలో రాజకీయ ఉద్రిక్తత మరింత పెరిగింది. రైతు రామారావు చనిపోవడంతో అక్కడున్న రైతులు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు.








