దక్షిణాది చిత్ర పరిశ్రమలో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించే 70వ ఫిల్మ్ఫేర్ సౌత్ అవార్డుల వేడుక కేరళలోని కొచ్చిలో ఘనంగా జరిగింది. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ చిత్ర పరిశ్రమలకు చెందిన పలువురు ప్రముఖులు ఈ వేడుకలో పాల్గొని సందడి చేశారు. 2024 సంవత్సరానికి గాను అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన నటీనటులు, సాంకేతిక నిపుణులకు అవార్డులు ప్రదానం చేయగా, ‘పుష్ప 2: ది రూల్’ చిత్రానికి గాను అల్లు అర్జున్ (Allu Arjun) ఉత్తమ నటుడు అవార్డు (Best Actor Award)ను అందుకున్నారు. అలాగే ‘35: చిన్న కథ కాదు’ సినిమాకి గాను నివేదా థామస్ ఉత్తమ నటి అవార్డు అందుకోవడం విశేషంగా నిలిచింది. ఈ అవార్డులతో దక్షిణాది సినీ రంగం మరోసారి దేశవ్యాప్తంగా తన ప్రతిభను ఘనంగా చాటుకుంది.
అల్లు అర్జున్ ఫిల్మ్ఫేర్ అవార్డుల లెక్కలు పరిశీలిస్తే, తాజా గెలుపుతో మొత్తం 7 ఫిల్మ్ఫేర్ అవార్డులను సొంతం చేసుకుని మెగాస్టార్ చిరంజీవి రికార్డుకు సమం అయ్యారు. ‘పుష్ప: ది రైజ్’ (Pushpa: The Rise) మరియు ‘పుష్ప 2’ (Pushpa 2) సినిమాలతో పాన్ ఇండియా స్థాయిలో ప్రత్యేక గుర్తింపును సంపాదించిన బన్నీ, ఇప్పుడు వరుస ప్రాజెక్టులతో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే ఒక సినిమా అట్లీ దర్శకత్వంలో, మరొకటి లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో రూపొందనున్నట్లు సమాచారం. ఈ భారీ ప్రాజెక్టులతో అల్లు అర్జున్ (Allu Arjun) తన పాన్ ఇండియా స్థాయిని (Pan-India Stardom) మరింత బలపరుచుకుంటాడని అభిమానులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.








