సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనపై అసెంబ్లీలో సీఎం రేవంత్ చేసిన వ్యాఖ్యలపై టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ స్పందించారు. ఈ ఘటనలో ఓ మహిళ మృతి చెందడం, ఆమె కుమారుడు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న విషయంలో తన నిర్లక్ష్యాన్ని చూపించారని సీఎం రేవంత్ రెడ్డి చేసిన ఆరోపణలపై బన్నీ తన నివాసంలో మీడియా సమావేశం నిర్వహించారు.
పోలీసుల డైరెక్షన్లోనే థియేటర్లోకి వెళ్లా..
తొక్కిసలాట ఘటన అనుకోకుండా జరిగిందని, ఇందులో ఎవరి తప్పు లేదన్నారు. తాను ఎటువంటి రోడ్ షో నిర్వహించలేదని, పోలీసుల డైరెక్షన్లోనే సంధ్య థియేటర్లోకి వెళ్లానని చెప్పారు. లోపలికి వెళ్లగానే బయట క్రౌడ్ ఎక్కువగా ఉందని పోలీసులు వచ్చి వెళ్లిపోండి అని చెప్పగానే, తాను తన కుటుంబ సభ్యులను తీసుకొని అక్కడి నుండి వెళ్లిపోయానన్నారు. తొక్కిసలాట గురించి ఒక మహిళ మృతి చెంది, ఆమె కుమారుడు ఆస్పత్రిలో ఉన్నాడని తరువాతి రోజు తెలిసిందని బన్నీ చెప్పారు.
ఆ కుటుంబానికి అండగా ఉంటాం..
ఈ వార్త విని తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యానని అల్లు అర్జున వెల్లడించారు. తనపై కోర్టులో కేసు ఉన్నందున న్యాయపరమైన సమస్యలు వస్తాయని మాత్రమే తను శ్రీతేజ్ను కలిసేందుకు ఆస్పత్రికి వెళ్లలేదని చెప్పారు. తాను వెళ్లలేక పోయినా బాధిత కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకుంటామని, శ్రీతేజ్ చికిత్స ఖర్చులు అన్నీ భరిస్తానని హామీ ఇచ్చామని వెల్లడించారు.
నాకూ ఓ కుటుంబం ఉంది
కొందరు కావాలనే తన క్యారెక్టర్ దిగజార్చే ప్రయత్నం చేస్తున్నారని, తనకూ ఓ కుటుంబం ఉందని, ఆ బాధ ఎలా ఉంటుందో తనకు తెలుసని అల్లు అర్జున్ ఆవేదన వ్యక్తం చేశారు. బయట తన గురించి జరుగుతున్నది అబద్దపు ప్రచారం అని, తన వ్యక్తిత్వాన్ని దిగజార్చే ప్రయత్నాలు చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. మూడేళ్లు కష్టపడి చేసిన సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నప్పటికీ సెలబ్రేషన్స్ లో పాల్గొనడం లేదని వివరించారు. పుష్ప సినిమా చేస్తున్న ప్రతిసారీ తాను తెలుగోడి సత్తా ప్రపంచవ్యాప్తంగా చాటాలని చూశానని, కానీ ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే తనను కిందకు లాగేయ్యాలని చూస్తున్నారంటూ బన్నీ సంచలన వ్యాఖ్యలు చేశారు.