ప్రముఖ హీరో అల్లు అర్జున్ రెగ్యులర్ బెయిల్ పిటిషన్పై విచారణ వాయిదా పడింది. అల్లు అర్జున్ వేసిన రెగ్యులర్ బెయిల్ పిటిషన్పై చిక్కడపల్లి పోలీసులు నాంపల్లి కోర్టులో కౌంటర్ దాఖలు చేశారు. బన్నీకి బెయిల్ మంజూరు చేయాలని ఆయన తరఫున న్యాయవాదులు వాదనలు వినిపించారు. ఇరుపక్షాల వాదనలు విన్న నాంపల్లి కోర్టు విచారణను వచ్చే నెల 3వ తేదీకి వాయిదా వేసింది.
పుష్ప-2 బెనిఫిట్ షో సమయంలో సంధ్య థియేటర్ వద్ద రేవతి మృతిచెందిన కేసులో ఈ పిటిషన్పై విచారణ జరిగింది. అల్లు అర్జున్ తరఫున సీనియర్ కౌన్సిల్ నిరంజన్ రెడ్డి వాదనలు వినిపించారు. ప్రాసిక్యూషన్ ఈ పిటిషన్ను కొట్టివేయాలని కోర్టును కోరింది.
నాంపల్లి కోర్టు విధించిన 14 రోజుల రిమాండ్ గడువు ముగియడంతో గత శుక్రవారం డిసెంబర్ 27 అల్లు అర్జున్ వర్చువల్గా కోర్టుకు హాజరు అయ్యారు. ఆ సమయంలో అల్లు అర్జున్ న్యాయవాదులు రెగ్యులర్ బెయిల్ కోసం పిటిషన్ దాఖలు చేశారు. కౌంటర్ దాఖలుకు పోలీసులు సమయం కోరగా నేటికి వాయిదా పడింది. రెగ్యులర్ బెయిల్పై నేడు నాంపల్లి కోర్టులో విచారణ జరుగగా, తీర్పును జనవరి 3కి వాయిదా వేసింది.
ఈ కేసులో ఇప్పటికే హైకోర్టు డిసెంబర్ 13న నాలుగు వారాల మధ్యంతర బెయిల్ను మంజూరు చేసింది. అయితే, జనవరి 10న ఈ మధ్యంతర బెయిల్ గడువు ముగియనుంది. ఈ నేపథ్యంలో జనవరి 3న నాంపల్లి కోర్టు ఇ తీర్పుపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.