నిన్న సాయంత్రం ఎర్రకోట (Red Fort)లో జరిగిన కారు బ్లాస్ట్ దేశ రాజధానితో పాటు యావత్ దేశాన్ని ఉలిక్కిపడేలా చేసింది. పేలుడుకు కారణమైన ఐ20 కారుకు సంబంధించిన సీసీటీవీ దృశ్యాలు వెలుగులోకి వచ్చాయి. ఆ కారు నడుపుతున్న వ్యక్తి డాక్టర్ ఉమర్ (Dr. Umar) నబీ అని పోలీసులు అనుమానిస్తున్నారు. గత రెండు రోజులుగా దేశవ్యాప్తంగా ఛేదిస్తోన్న ఉగ్ర కుట్రల్లో భాగమైన వారిలో ఏకంగా ఐదుగురు వైద్యులు ఉండటం సంచలనం సృష్టిస్తోంది.
ఫరీదాబాద్ (Faridabad)లోని ఆల్ ఫలాహ్ యూనివర్సిటీ (Falah University) ఉగ్రవాద కార్యకలాపాలకు అడ్డాగా మారినట్లు పోలీసులు వెల్లడించారు. ఈ కేసులో ముగ్గురు యూనివర్సిటీ డాక్టర్లను ఉగ్రవాద అనుబంధ ఆరోపణలతో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అరెస్టైన వారిలో డాక్టర్ ముజామిల్ షకీల్, డాక్టర్ షహీన్ షహీద్ ఉన్నారు. అరెస్టుల భయంతో డాక్టర్ ఉమర్ మహమూద్ పారిపోయి నిన్న ఎర్రకోట వద్ద బాంబు పేల్చి సూసైడ్ బాంబర్గా మారాడని అనుమానిస్తున్నారు. ఈ ఘటనతో దేశవ్యాప్తంగా భయాందోళనలు చెలరేగాయి. పోలీసులు ఆల్ ఫలాహ్ యూనివర్సిటీ మెడికల్ కాలేజ్ ప్రిన్సిపల్ సహా సిబ్బందిని ప్రశ్నిస్తున్నారు.
డాక్టర్ ముజామిల్ షకీల్ ఫరీదాబాద్లోని దౌజా గ్రామంలో అద్దెకు తీసుకున్న రెండు ఇళ్లలో మూడు టన్నుల పేలుడు పదార్థాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ప్రాథమిక విచారణలో జైషే మహ్మద్ ఉగ్రవాద సంస్థ యూనివర్సిటీ ద్వారా వైట్ కలర్ టెర్రర్ మాడ్యూల్ను ఏర్పాటు చేసినట్లు వెల్లడైంది. ఈ మాడ్యూల్లో డాక్టర్లు, స్టూడెంట్స్ను ఉగ్రవాదులుగా తయారు చేయడం లక్ష్యంగా పనిచేసినట్లు అధికారులు తెలిపారు. జైషే మహ్మద్ మహిళా విభాగానికి కమాండర్గా వ్యవహరించిన డాక్టర్ షహీనా కూడా అరెస్టైనట్లు సమాచారం. యూనివర్సిటీలోని పలువురిపై పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు.








