ఉత్తరప్రదేశ్ మాజీ సీఎం, సమాజ్వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ చేసిన తాజా వ్యాఖ్యలు రాజకీయ వాతావరణాన్ని వేడెక్కించాయి. సీఎం యోగి ఆదిత్యనాథ్ అధికార నివాసం కింద శివలింగం ఉందని, అక్కడ కూడా తవ్వకాలు జరపాలని అఖిలేష్ డిమాండ్ చేశారు. ఈ వ్యాఖ్యలు మొన్నటి సంభాల్లో మొఘల్ కాలం నాటి మసీదు సర్వే నేపథ్యంలో ఉత్పన్నమైన పరిణామాల మధ్య వెలువడ్డాయి. సంభాల్లో మసీదు సర్వే తర్వాత అల్లర్లు చెలరేగి, కొన్ని చోట్ల ఇళ్ల కూల్చివేతలు, తవ్వకాలు కొనసాగడం తెలిసిందే.
బీజేపీపై విమర్శలు
కాగా, అఖిలేష్ యాదవ్ మీడియాతో మాట్లాడుతూ, బీజేపీ ప్రభుత్వం తన వైఫల్యాలను కప్పిపుచ్చడానికే ఈ తవ్వకాల డ్రామాలు నిర్వహిస్తున్నదని ఆరోపించారు. అమాయకుల ఇళ్లను బుల్డోజర్లతో అక్రమంగా కూల్చివేస్తున్నారు. మా నమ్మకం ప్రకారం, సీఎం నివాసం కింద శివుడి రూపాన్ని సూచించే శివలింగం ఉంటుంది. అక్కడ కూడా తవ్వకాలు జరపాలి అని అఖిలేష్ డిమాండ్ చేశారు.
బీజేపీ ప్రతిస్పందన
అఖిలేష్ వ్యాఖ్యలపై బీజేపీ అధికార ప్రతినిధి షెహజాద్ పూనావాలా తీవ్రంగా స్పందించారు. ఓటు బ్యాంకు రాజకీయాల కోసం శివలింగం గురించి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సిగ్గుచేటు అని, ఇది రాజకీయ అనైతికతకు చిహ్నం అంటూ విమర్శించారు. ప్రస్తుతం అఖిలేష్ యాదవ్ చేసిన ఆరోపణలు దేశ వ్యాప్తంగా సంచలనంగా మారాయి.