గుజరాత్ (Gujarat)లోని అహ్మదాబాద్లో(Ahmedabad) ఎయిర్ ఇండియా విమానం (Air India Airplane) (AI171) టేకాఫ్ (Take-Off)అయిన కొద్ది నిమిషాల్లో కూలిపోయిన ఘోర ప్రమాదంలో 241 మంది ప్రయాణికులు, సిబ్బంది మృతి చెందగా, ఒకే ఒక్క వ్యక్తి, రమేష్ విశ్వాస్ కుమార్ (Ramesh Vishwas Kumar) (40), స్వల్ప గాయాలతో ప్రాణాలతో బయటపడ్డాడు. బ్రిటిష్ పౌరసత్వం (British Citizenship) కలిగిన రమేష్, విమానంలో 11A సీటులో, ఎమర్జెన్సీ ఎగ్జిట్ సమీపంలో కూర్చోవడం వల్ల, ప్రమాద సమయంలో వెంటనే దూకి బయటపడ్డాడని అధికారులు తెలిపారు. ఈ విమానం, సర్దార్ వల్లభాయ్ పటేల్ (Sardar Vallabhbhai Patel) అంతర్జాతీయ విమానాశ్రయం (International Airport) నుంచి లండన్ (London)లోని గాట్విక్ (Gatwick)కు బయలుదేరిన బోయింగ్ 787-8 డ్రీమ్లైనర్, మేఘానినగర్ జనావాస ప్రాంతంలో కూలిపోయి, భారీ మంటలతో కాలిపోయింది.
రమేష్, ఛాతీ, కళ్లు, కాళ్లపై స్వల్ప గాయాలతో అహ్మదాబాద్లోని సివిల్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నాడు. చికిత్స పొందుతున్న రమేష్ను కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా పరామర్శించారు. రమేష్ విశ్వాస్ కుమార్, గుజరాత్లోని తన కుటుంబాన్ని కలవడానికి భారత్కు వచ్చి, తన సోదరుడు అజయ్ కుమార్ రమేష్ (45)తో కలిసి లండన్కు తిరిగి వెళ్తుండగా ఈ దుర్ఘటన జరిగింది.
“టేకాఫ్ అయిన 30 సెకన్లలో భారీ శబ్దం వినిపించింది, వెంటనే విమానం కూలిపోయింది. నా చుట్టూ శవాలు, విమాన శకలాలు కనిపించాయి. భయంతో లేచి పరిగెత్తాను. ఎవరో నన్ను పట్టుకొని యాంబులెన్స్లో ఆస్పత్రికి తీసుకెళ్లారు” అని రమేష్ జాతీయ మీడియాతో తెలిపినట్లుగా వార్తలు వస్తున్నాయి. దురదృష్టవశాత్తూ సోదరుడు అజయ్ ఆచూకీ ఇంకా లభ్యం కాలేదని, అతని కోసం రమేష్ ఆందోళన వ్యక్తం చేశాడు. అహ్మదాబాద్ పోలీస్ కమిషనర్ జీఎస్ మాలిక్, 11A సీటులో ఒక ఏకైక బతికిన వ్యక్తిని గుర్తించామని, అతను చికిత్స పొందుతున్నాడని ధృవీకరించారు. ఈ ఘటనలో రమేష్ బయటపడటం నిజంగా అద్భుతమని స్థానికులు, రెస్క్యూ బృందాలు అభివర్ణించాయి.