కల్తీ పాలు, కల్తీ నీళ్లు.. ప్రజల ప్రాణాలు గాల్లో, నాయకులు ఆటపాటల్లో!

కల్తీ పాలు, కల్తీ నీళ్లు.. ప్రజల ప్రాణాలు గాల్లో, నాయకులు ఆటపాటల్లో!

ఓట్లు వేసి గెలిపించిన ప్రజలు ఈరోజు ప్రాణ భయంతో గడుపుతుంటే… గెలిచిన నాయకులు (Winning Leaders) అసెంబ్లీ అనంతరం ఆటపాటల్లో మునిగితేలుతున్నారనే ఆరోపణలు రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. ఆంధ్రప్రదేశ్‌ (Andhra Pradesh)లో పాలు తాగాలన్నా, నీళ్లు తాగాలన్నా భయపడే పరిస్థితి నెలకొనడం ఆందోళన కలిగిస్తోంది. కల్తీ నీళ్లు (Contaminated Water), కల్తీ పాలు (Adulterated Milk) తాగి ప్రాణాలు కోల్పోతున్న ఘటనలు ప్రజల్లో భయాందోళనలను రేకెత్తిస్తున్నాయి.

శ్రీకాకుళంలో డయేరియా విజృంభణ
ఉత్తరాంధ్రలోని శ్రీ‌కాకుళం (Srikakulam) జిల్లాలో డయేరియా (Diarrhea) కేసులు రోజురోజుకీ పెరుగుతున్నాయి. క‌లుషిత నీరు తాగి రెండ్రోజుల వ్య‌వ‌ధిలో నలుగురు మృతి చెందారు. ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల్లో 70 మందికి పైగా చికిత్స పొందుతున్నారు. పలువురి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని వైద్య వర్గాలు చెబుతున్నాయి. డయేరియాను ప్రారంభ దశలో గుర్తించడంలో యంత్రాంగం విఫలమైందనే విమర్శలు వినిపిస్తున్నాయి.

మరణాలు సంభవిస్తుండటంతో ప్రభావిత ప్రాంతాల ప్రజల్లో ఆందోళన పెరిగింది. మంచినీటి సరఫరా సక్రమంగా లేకపోవడంతో పరిస్థితి మరింత దిగజారిందని స్థానికులు ఆరోపిస్తున్నారు. ప్రభావిత ప్రాంతాల్లో రెడ్‌క్రాస్ సంస్థ నీటిని పంపిణీ చేస్తుండగా, దళిత వాడల్లో సరైన సరఫరా లేదంటూ మహిళలు ఖాళీ బిందెలతో నిరసన వ్యక్తం చేశారు. “ఓట్ల కోసం వస్తే సమాధానం ఇస్తాం” అంటూ ప్రభుత్వంపై హెచ్చరికలు జారీ చేశారు.

రాజమండ్రిలో కల్తీ పాలు కలకలం
తూర్పు గోదావరి జిల్లా రాజ‌మండ్రిలో కల్తీ పాలు తాగి ఆరుగురు మృతి చెందిన ఘటన సంచలనం సృష్టించింది. దివాన్ చెరువు, లాలా చెరువు, చౌడేశ్వరి నగర్ ప్రాంతాలకు చెందిన పలువురు ప్రాణాలు కోల్పోయారు. ఇద్దరు చిన్నారుల పరిస్థితి విషమించడంతో వెంటిలేటర్‌పై చికిత్స అందిస్తున్నారు. వైద్య ఆరోగ్య శాఖ అధికారులు పరీక్షలు నిర్వహించి, సరఫరా అవుతున్న పాల వల్లే సమస్య తలెత్తిందని ప్రాథమికంగా గుర్తించినట్లు సమాచారం.

ప్రజల ప్రశ్నలు… ప్రభుత్వంపై విమర్శలు
రాష్ట్రంలో ప్రాణాపాయ పరిస్థితులు నెలకొంటే, ప్రజాప్రతినిధులు మాత్రం విజయవాడలో వినోద కార్యక్రమాల్లో పాల్గొంటున్నారనే విమర్శలు తీవ్రంగా వినిపిస్తున్నాయి. “ప్రాణాలు గాల్లో కలిసిపోతుంటే నాయకులు ఆటపాటల్లో మునిగితేలడం సరైనదేనా?” అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ముఖ్యంగా ఆరోగ్య, పంచాయతీరాజ్, మున్సిపల్ శాఖల సమన్వయం లోపించిందని ఆరోపణలు ఉన్నాయి. నీటి శుద్ధి, పాల సరఫరాపై కఠిన నియంత్రణలు లేకపోవడం వల్లే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని విశ్లేషకులు అంటున్నారు.

కరోనా టైమ్‌లో ఇలాంటి ప్ర‌భుత్వ‌మే ఉంటే..
ప్ర‌స్తుత కూట‌మి ప్ర‌భుత్వం క‌రోనా మ‌హ‌మ్మారి టైమ్‌లో ఉంటే ఎంత దారుణంగా ఉండేదో ఊహించుకోవచ్చని రాజకీయ విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. ప్రజల ఆరోగ్య భద్రత ప్రభుత్వ ప్రధాన బాధ్యత అని గుర్తు చేస్తున్నారు. డ‌యేరియా విజృంభిస్తున్న‌ ప్రాంతాల్లో శుద్ధి చేసిన మంచినీటి సరఫరా, పాల సేకరణ, పంపిణీ కేంద్రాలపై ప్రత్యేక తనిఖీలు, బాధితులకు ఉచిత వైద్యం, పరిహారం, బాధ్యులపై కఠిన చర్యలు వంటి నిర్ణ‌యాలు, చ‌ర్య‌లు ఏమ‌య్యాయ‌ని ప్ర‌శ్నిస్తున్నారు.

ప్రజలు ఎన్నుకున్న నాయకులు ప్రజల ప్రాణ భద్రతను ప్రథమ కర్తవ్యంగా భావించాల్సిన సమయం ఇదే. కానీ, ప్ర‌భుత్వ పెద్ద‌లు ఆట పోటీల పేరుతో నియోజ‌క‌వ‌ర్గ ప్ర‌జ‌ల ప‌ట్ల నిర్ల‌క్ష్యం ప్ర‌ద‌ర్శించి వారి ప్రాణాల మీద‌కు తెస్తే రాబోయే రోజుల్లో వారి ఆగ్ర‌హావేశాల‌కు గురికాక త‌ప్ప‌దంటున్నారు రాజ‌కీయ విశ్లేష‌కులు.

Join WhatsApp

Join Now

Leave a Comment