తెలంగాణ శాసనమండలి సభ్యుడు (ఎమ్మెల్సీ), కాంగ్రెస్ నాయకుడు అద్దంకి దయాకర్ (Addanki Dayakar) ఏపీ డిప్యూటీ సీఎం (AP Deputy CM), జనసేన పార్టీ అధ్యక్షుడు (JanaSena Party President) పవన్ కళ్యాణ్ (Pawan Kalyan)పై సంచలన ఆరోపణలు చేశారు. విజయవాడలో (Vijayawada) అద్దంకి దయాకర్ను దళిత సంఘాలు సన్మానించాయి. టీమ్ అద్దంకి ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) తరపున ఆయనకు సన్మానం జరిగింది. ఈ సందర్భంగా ఆయన సీఎం రేవంత్ రెడ్డితో (CM Revanth Reddy) తన అనుబంధాన్ని గురించి వివరించారు. రాజకీయ పదవుల కంటే సమాజ సేవే తన లక్ష్యమన్నారు. ఈ కార్యక్రమంలో ఆయన జనసేన అధ్యక్షుడు, ఏపీ ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్పై సంచలన వ్యాఖ్యలు చేస్తూ, దళితులు, బడుగు బలహీన వర్గాల హక్కుల కోసం తాను కొనసాగుతానని స్పష్టం చేశారు.
అద్దంకి దయాకర్ మాట్లాడుతూ, తాను రాజకీయాల్లోకి పదవుల కోసం రాలేదని, మాలమహానాడు సంఘంతో (Mala Mahanadu Organization) తన జీవితాన్ని ప్రారంభించానని చెప్పారు. “సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో తెలంగాణ అభివృద్ధి (Telangana Development) దిశగా సాగుతోంది. ఆయనకు సహకరించడమే నా విధి. మనం యుద్ధం చేయలేనప్పుడు, సరైన నాయకుడు ముందుకొచ్చినప్పుడు తోడ్పాటు అందించడం మన బాధ్యత,” అని ఆయన పేర్కొన్నారు. మంత్రి పదవి వచ్చినా, రాకపోయినా తాను బాధపడనని, తన లక్ష్యం సమాజంలో సమానత్వం, దళితుల (Dalits) ఉన్నతి కోసం పనిచేయడమేనని స్పష్టం చేశారు.
పవన్పై సంచలన వ్యాఖ్యలు
“సింధులోయ నాగరికత (Indus Valley Civilization) ఈ దేశ ద్రవిడులది. హరప్పాలో (Harappa) ద్రవిడ సంస్కృతి (Dravidian Culture) ఉంది. చరిత్ర తెలియకుండా పవన్ కళ్యాణ్ మాట్లాడుతున్నారు. ఆయన చెగువేరా నుంచి చంద్రముఖిగా (Chandramukhi) మారి, సనాతన ధర్మం (Sanatana Dharma) వైపు వెళ్లారు. సనాతన ధర్మంలో విడాకులు లేవని చెప్పుకుంటారు, కానీ ఇద్దరికి విడాకులు ఎందుకు ఇచ్చారు? రష్యా మహిళను పెళ్లి చేసుకున్నా, రష్యాకు పొమ్మని ఎవరూ చెప్పలేదన్నారు. ఈ దేశంలో సనాతన ధర్మం కంటే పురాతన ధర్మం ఉందని పవన్ తెలుసుకోవాలి” అని దయాకర్ విమర్శించారు. జంబూద్వీపం ఈ దేశపు మాదిగల చరిత్రను ప్రస్తావిస్తూ “మహావిధ అనే మాదిగ ఈ దేశంలో మొట్టమొదటి రాజు. అలాంటి వారిని చెప్పులు కుట్టే స్థితికి ఎందుకు తెచ్చారో పవన్ ఆలోచించాలి” అని ప్రశ్నించారు. సతీ సహగమనం వంటి ఆచారాలను ధర్మంగా ఎలా భావిస్తారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
బీజేపీ, ఆర్ఎస్ఎస్లపై విమర్శలు..
“హిందూ మతం అందరినీ ఆలింగనం చేస్తుంది. కానీ మీరు అనుసరిస్తున్నది వలసవాద సంస్కృతి. దళితులు, గిరిజనులు, బడుగు బలహీన వర్గాల చదువును అడ్డుకుంటే భవిష్యత్తు మిమ్మల్ని క్షమించదు” అని హెచ్చరించారు. చంద్రబాబు నాయుడుపై కూడా విమర్శలు చేస్తూ “చంద్రబాబు టీడీపీ వారికి మాత్రమే కాదు, మా వారి కోసం కూడా పనిచేయాలి” అని అన్నారు. దళితులు, బడుగు వర్గాల హక్కుల కోసం తన పోరాటం కొనసాగుతుందని, రాజకీయ వ్యతిరేకతలను పట్టించుకోనని దయాకర్ స్పష్టం చేశారు.