విశ్వక్సేన్ (Vishwak Sen) ద్విపాత్రాభినయంతో థియేటర్లలో విడుదలకు సిద్ధమైన లైలా మూవీపై పొలిటికల్ కామెంట్స్ ఎఫెక్ట్ గట్టిగా పడినట్టుంది. పాజిటివా.. నెగిటివా అనేది పక్కనబెడితే ఎక్స్ (ట్విట్టర్)లో ఈ సినిమా దేశ వ్యాప్తంగా ట్రెండింగ్ అవుతుంది. లైలా సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఆదివారం హైదరాబాద్లో ఘనంగా జరిగింది. ఈవెంట్కు హాజరైన ముఖ్య అతిథి చిరంజీవి (Chiranjeevi) చేసిన వ్యాఖ్యలు సంచలనం రేపాయి. సినిమా ఈవెంట్లో పొలిటికల్ ప్రస్తావన లేవనెత్తి జై జనసేన అంటూ నినదించారు.
మరో నటుడు కమ్ జనసేన పార్టీ లీడర్ 30 ఇయర్స్ ఇండస్ట్రీ ఫృధ్వీ (Prithviraj) వ్యాఖ్యలపై నెటిజన్లు మండిపడుతున్నారు. 150 మేకలు.. చివరకు 11 మేకలు అయ్యాయి అంటూ వైసీపీ (YSRCP) గురించి ఇండైరెక్ట్గా ప్రస్తావించడంతో ఆ పార్టీ శ్రేణులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎక్స్ (ట్విట్టర్)లో ‘బాయ్కాట్ లైలా’ (BoycottLaila) హ్యాష్ట్యాగ్ను ట్రెండ్ అవుతోంది. ఫృధ్వీ చేసిన కామెంట్స్ ఆ చిత్ర నిర్మాతలకు శాపంగా మారాయి.
నమ్మి వేషం ఇస్తే..
ఫృధ్వీ కామెంట్ల కారణంగా కొందరు వైసీపీ అభిమానులు సినిమాను ‘లైలా సినిమాను బాయ్కాట్’ (BoycottLailaMovie) చేస్తున్నట్లు పోస్టుల ద్వారా ప్రకటించేస్తున్నారు. సినీ వేదికపై సినిమా వ్యవహారాల గురించి చర్చించకుండా, పొలిటికల్ కామెంట్స్ చేయడంపై సినీ అభిమానులు సైతం ఆగ్రహంతో ఉన్నారు. నమ్మి సినిమాలో వేషం ఇచ్చిన నిర్మాతలను ముంచుతున్నాడని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
గేమ్ఛేంజర్ సినిమా ఈవెంట్లోనూ..
మెగాస్టార్ చిరంజీవి కుమారుడు, గ్లోబల్ స్టార్ రామ్చరణ్ నటించిన గేమ్ ఛేంజర్ మూవీ సంక్రాంతి సందర్భంగా రిలీజ్ అయ్యింది. అయితే ఈ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ను రాజమండ్రిలో నిర్వహించారు. ఈ ఈవెంట్లోనూ 30 ఇయర్స్ ఇండస్ట్రీ ఫృధ్వీ పొలిటికల్ కామెంట్లు చేశారు. వైసీపీ పేరు, 11 సీట్లంటూ వ్యంగ్యంగా కామెంట్లు చేయడంతో వైసీపీ అభిమానుల ఆగ్రహం వ్యక్తం చేశారు. గేమ్ ఛేంజర్ మూవీని బహిష్కరిస్తున్నట్లుగా కొందరు హార్డ్కోర్ ఫ్యాన్స్ స్వతహాగా ప్రకటించేశారు. ఎన్నో అంచనాల నడుమ రిలీజ్ అయిన రామ్చరణ్ గేమ్ ఛేంజర్ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద అంత ప్రభావం చూపలేకపోయింది. దీనికి కారణంగా కూడా ఫృధ్వీనే అనే వాదన కూడా ఉంది.
తప్పుచేసినా కంటిన్యూ చేయలేదనేనా..?
వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ఫృధ్వీని ఎస్వీబీసీ ఛానల్ చైర్మన్గా నియమిస్తూ అత్యున్నత పదవి కట్టబెట్టారు వైఎస్ జగన్. కొంతకాలం తరువాత ఆ ఛానల్లో పనిచేస్తున్న మహిళ పట్ల అసభ్యకరంగా ప్రవర్తించాడనే ఆరోపణల నేపథ్యంలో ఆయన్ను ఆ పదవి నుంచి తొలగించింది వైసీపీ ప్రభుత్వం. అప్పట్లో ‘వెనక నుంచి వాటేసుకుంటా
‘ అనే కామెంట్ల విపరీతంగా వైరల్ అయ్యాయి. అప్పటి నుంచి వైసీపీపై పగతో రగిలిపోతున్నట్లుగా అర్థం అవుతుంది. పర్సనల్ విషయాలను సినిమా ఇండస్ట్రీపై రుద్దుతూ.. నమ్మి వేషం ఇచ్చిన నిర్మాతలకు కలెక్షన్లకు గండికొడుతున్నాడని 30 ఇయర్స్ ఇండస్ట్రీ ఫృధ్వీపై సినీ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.