తెలంగాణను అవినీతి రహిత రాష్ట్రంగా మార్చేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగానే ఆర్టిఏ కార్యాలయాల్లో జరుగుతున్న అవినీతిపై ఫోకస్ పెట్టిన ఏసీబీ అధికారులు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఆర్టిఏ కార్యాలయాలపై దాడులు నిర్వహిస్తున్నారు. హైదరాబాద్లో ఉప్పల్ ఆర్టిఏ కార్యాలయంతో పాటు తిరుమలగిరి ఆర్టిఏ కార్యాలయంలో ఏసీబీ సోదాలు కొనసాగుతున్నాయి.
ప్రధానంగా ఆర్టిఏ కార్యాలయాల్లో జరుగుతున్న అవినీతి బ్రోకర్ల చేతివాటం, మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ల సహకారం వంటి అంశాలపై ఏసీబీ అధికారులు ఈ దాడులను కొనసాగిస్తున్నారు. గతంలోనూ మే 28న ఇదే రీతిలో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఆర్టిఏ కార్యాలయాలపై ఏసీబీ దాడులు కొనసాగించింది. లైసెన్స్ కావాలని ఒక వినియోగదారుడు రూపంలో వెళ్ళిన ఎసిబి అధికారులు బ్రోకర్ల చేతివాటం, వారి వ్యవహారం మొత్తాన్ని సీక్రెట్ కెమెరాలో రికార్డు చేశారు. బ్రోకర్ల సిఫార్సు ఉంటేనే కొన్నిసార్లు ఆర్టిఏ అధికారులు అప్లికేషన్లను యాక్సెప్ట్ చేస్తూ.. ఒకవేళ ఏజెంట్లు సిఫార్సు లేకుంటే అప్లికేషన్లు రిజెక్ట్ చేస్తున్నట్టు గుర్తించారు.
లర్నింగ్ లైసెన్స్ తో పాటు వాహనానికి సంబంధించిన ఫిట్నెస్ సర్టిఫికెట్, వాహన ఓనర్షిప్ ట్రాన్స్ఫర్ సర్టిఫికెట్ వంటి అంశాల పై ఏసీబీ RTA కార్యాలయాల పని తీరు, అక్కడ జరుగుతున్న అవినీతిపై ఏసీబీ ఫోకస్ చేస్తుంది. హైదరాబాద్ తో పాటు తెలంగాణలోని పని జిల్లాల్లో ఉన్న ఆర్టిఏ కార్యాలయంలో సైతం చేసేది ఇదే రీతిలో తనిఖీలు నిర్వహిస్తుంది.
సికింద్రాబాద్.. తిరుమలగిరిలోని ఆర్టిఏ కార్యాలయంలో ఏసిబి అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. గురువారం ఉదయం నుండి ఈ సోదాలు కొనసాగుతూనే ఉన్నాయి. తిరుమలగిరి ఆర్టిఏ కార్యాలయంలో గత కొంతకాలంగా ఏజెంట్ల ఆగడాలు శృతిమించిపోతున్నాయనే ఆరోపణల నేపథ్యంలో ఏసీబీ అధికారులు సుమోటోగా తీసుకొని సోదాలను నిర్వహిస్తున్నారు. ఆఫీస్లోని 18 మంది ఏజెంట్లు అక్రమంగా వాహనాల లైసెన్సుల జారీ విషయంలో కమిషన్లు తీసుకుంటూ అక్రమ దందాలు చేస్తున్నట్లు అధికారులు గుర్తించారు. వారిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.