తెలంగాణ రాష్ట్రంలో భారీ నీటిపారుదల రంగంలో కీలకంగా నిలిచిన కాళేశ్వరం ప్రాజెక్ట్ ఇప్పుడు మరోసారి వివాదాల్లో చిక్కుకుంది. ఈ ప్రాజెక్టులో కీలక పాత్ర పోషించిన ఇరిగేషన్ శాఖ మాజీ ఎన్సీ (ENC) హరిరామ్ ఇంటిపై ఏసీబీ (ACB) అధికారులు దాడులు నిర్వహిస్తున్నారు. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ (NDSA) ఇటీవల విడుదల చేసిన నివేదిక ప్రకారం.. మేడిగడ్డ బ్యారేజీ డిజైన్లో తీవ్రమైన లోపాలు ఉన్నట్టు తేలింది. అదే ఆధారంగా ఏసీబీ అధికారులు దేశవ్యాప్తంగా 14 ప్రాంతాల్లో ఏకకాలంలో తనిఖీలు చేపట్టారు.
ఈ పరిణామాలు కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణంలో జరిగిన వైఫల్యాలపై మరింత దృష్టిని సారిస్తున్నాయి. ప్రభుత్వ స్థాయిలో కీలక నిర్ణయాలు తీసుకున్న అధికారులు మరియు ఇంజినీర్ల పాత్రపై విచారణ కొనసాగుతోంది. కాగా, నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ (NDSA) తాజా నివేదికను రాష్ట్ర కేబినెట్లో చర్చించి, తదుపరి కార్యాచరణ ప్రకటిస్తామని మంత్రి ఉత్తమ్ కుమార్రెడ్డి శుక్రవారం ప్రకటించిన విషయం తెలిసిందే.