ఏపీ ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావుపై కొనసాగుతున్న క్రమశిక్షణ చర్యలను ఉపసంహరించుకుంటున్నట్లు కూటమి ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు.
ఇంటెలిజెన్స్ ఏడీజీగా ఉన్న సమయంలో నిబంధనలకు విరుద్ధంగా తన కుమారుడి పేరుతో ఉన్న కంపెనీ ద్వారా నిఘా పరికరాలు కొనుగోలు చేసినట్లు, ఆ పరికరాల ద్వారా ప్రతిపక్ష పార్టీల నేతల ఫోన్లు ట్యాప్ చేసినట్లుగా ఏబీ వెంకటేశ్వరరావుపై అభియోగాలు ఉన్నాయి. దీనిపై గత వైసీపీ ప్రభుత్వం ఎంక్వైరీ విధించగా, ఫోన్ల ట్యాంపింగ్ నిజమేనని తేలింది. కేంద్ర హోంశాఖ సైతం ప్రాసిక్యూషన్కు అనుమతి ఇచ్చింది. ఆలిండియా సర్వీస్ నిబంధనల ప్రకారం ఏబీ వెంకటేశ్వరరావుపై గత వైసీపీ ప్రభుత్వం క్రమశిక్షణ చర్యలు చేపట్టింది.
కాగా, కూటమి ప్రభుత్వం ఏబీ వెంకటేశ్వరరావుపై క్రమశిక్షణ చర్యలను ఉపసంహరించుకుంది. ఆయన రిటైరయ్యారు కాబట్టి అతనిపై క్రమశిక్షణ చర్యలు కొనసాగించడం సాధ్యం కాదని, న్యాయ శాఖ, అడ్వకేట్ జనరల్ సూచనల ఆధారంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. ఏబీ వెంకటేశ్వరరావుపై ఉన్న కేసులు, ఫిర్యాదులను ఉపసంహరించుకోవాలని ఏపీ డీజీపీకి సీఎస్ ఆదేశాలు ఇచ్చారు.








