బాలీవుడ్ స్టార్ అమీర్ ఖాన్ (Aamir Khan) తన రాబోయే చిత్రం ‘సితారే జమీన్ పర్’ (Sitare Zameen Par) ప్రమోషన్స్లో బిజీగా ఉన్నారు. ఈ సందర్భంగా ఇటీవల జరిగిన ప్రెస్ మీట్లో ఆయన తన భవిష్యత్ ప్రాజెక్టుల గురించి ఆసక్తికర విషయాలను వెల్లడించారు. ‘పీకే 2’ (PK 2) గురించి ఓ విలేకరి ప్రశ్నించగా, అది కేవలం పుకారు మాత్రమేనని, అలాంటి ప్రాజెక్టు గురించి తనకు ఎటువంటి సమాచారం లేదని అమీర్ స్పష్టం చేశారు. “మేము ‘దాదా సాహెబ్ ఫాల్కే’ (Dadasaheb Phalke) బయోపిక్పై పనిచేస్తున్నాం. రాజ్కుమార్ హిరాణీ (Rajkumar Hirani)తో కలిసి ఈ ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్తున్నాం. అలాగే, ‘మహాభారతం’ (Mahabharatam)పై సినిమా చేయాలన్నది నా 25 ఏళ్ల కల. ఇది కేవలం సినిమా కాదు, ఒక యజ్ఞంలా క్రమశిక్షణతో చేయాల్సిన ప్రాజెక్టు. దీనికి సన్నాహాలు జరుగుతున్నాయి, కానీ నా కల నెరవేరుతుందో లేదో చూడాలి,” అని ఆయన తెలిపారు.
ఇదే సమయంలో, తమిళ దర్శకుడు లోకేశ్ కనకరాజ్ (Lokesh Kanagaraj)తో సినిమా గురించి మరో ప్రశ్న రాగా, అమీర్ ఖాన్ ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. “అవును, నిజమే. మేమిద్దరం కలిసి ఓ సినిమా చేస్తున్నాం. ఇది సూపర్ హీరో జానర్ (Super Hero Genre)లో భారీ యాక్షన్ చిత్రంగా రూపొందనుంది. ప్రస్తుతం ఈ ప్రాజెక్టు పనుల్లో బిజీగా ఉన్నాం. వచ్చే ఏడాది (2026) రెండో అర్ధభాగంలో షూటింగ్ ప్రారంభించాలని ప్లాన్ చేస్తున్నాం. ఇప్పటికి ఈ ప్రాజెక్టు గురించి ఇంతకు మించి చెప్పలేను. రెండేళ్ల తర్వాత ఈ విషయంపై మరింత చర్చించుకుందాం,” అని అమీర్ స్పష్టం చేశారు. ఈ వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది.