ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మహిళలకు భద్రత కరువూంది. రోజుకో చోట ఆడపిల్లలపై అఘాయిత్యలు జరుగుతూనే ఉన్నాయి. ఐదేళ్ల చిన్నారిపై వృద్ధుడు లైంగిక దాడి.. వృద్ధురాలిపై యువకుడి అరాచకం ఇలా రాష్ట్రంలో ఏదో ఒక మూల రోజుకో సంఘటన వెలుగులోకి వస్తూనే ఉంది.
అన్నమయ్య జిల్లాలో యువతిపై యాసిడ్ దాడి, అనకాపల్లిలో హైస్కూల్ స్టూడెంట్స్పై పీఈటీ వేధింపుల ఘటనలు మరువక ముందే నంద్యాల జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. కామంతో కళ్లు మూసుకుపోయిన ఓ ఉపాధ్యాయుడు విద్యార్థిని పట్ల అసభ్యకరంగా ప్రవర్తించాడు. 7వ తరగతి చదువుతున్న విద్యార్థినిపై లైంగిక వేధింపులకు గురిచేశాడు. దీంతో గ్రామస్థులు ఆ కీచక టీచర్కు దేహశుద్ధి చేశాడు.
నంద్యాల జిల్లా పాణ్యం మండలం ఆలమూరు గ్రామంలోని మండల పరిషత్ అప్పర్ ప్రైమరీ స్కూల్లో 7వ తరగతి చదువుతున్న విద్యార్థినిపై అదే స్కూల్లో విద్యాబుద్ధులు బోధించే ఓ ఉపాధ్యాయుడు లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. భయంతో ఆ విద్యార్థిని రెండ్రోజులుగా స్కూల్కు వెళ్లడం మానేసింది. స్కూల్కు వెళ్లకుండా ఇంటిపట్టునే ఉంటుండడంతో తల్లిదండ్రులు ఆరా తీశారు. దీంతో జరిగిన విషయాన్ని ఆ విద్యార్థిని తల్లిదండ్రులకు వివరించింది. ఆగ్రహంతో రగిలిపోయిన బాలిక తల్లిదండ్రులు, గ్రామస్థుల సహాయంతో ఆ కీచక టీచర్కు దేహశుద్ధి చేశారు. దీంతో ఆ ఉపాధ్యాయుడు స్కూల్ వదిలి పారిపోయాడు.