న్యూఢిల్లీ రైల్వే స్టేషన్ (New Delhi Railway Station)లో శనివారం రాత్రి ఘోర విషాదం చోటుచేసుకుంది. ప్రయాణికుల రద్దీ కారణంగా తలెత్తిన తొక్కిసలాట(Stampede)లో 18 మంది ప్రాణాలు కోల్పోయారు. పలువురు గాయాలపాలయ్యారు. రైల్వే అధికారులు (India Railways), ప్రత్యక్ష సాక్షులు వెల్లడించిన వివరాల ప్రకారం ప్రయాగ్రాజ్ వెళ్లే రైళ్ల కోసం వేలాది మంది ప్రయాణికులు స్టేషన్కు చేరుకోవడంతో పరిస్థితి అదుపుతప్పి ఈ దుర్ఘటన చోటుచేసుకుంది.
ఎలా జరిగింది ఈ ఘటన?
కుంభమేళాకు వెళ్లేందుకు శనివారం రాత్రి భారీ సంఖ్యలో ప్రయాణికులు రైల్వే స్టేషన్కు చేరుకున్నారు. ప్రయాగ్రాజ్కు వెళ్లేందుకు ప్యాసింజర్లు రైళ్ల కోసం ఎదురుచూస్తున్నారు. రద్దీ అంతకంతకూ పెరుగుతూ వచ్చింది. శనివారం రాత్రి 9:55 గంటల ప్రాంతంలో ప్లాట్ఫామ్ 14, 15 భారీగా జనంతో నిండిపోయింది. విపరీతమైన జనం మధ్య చిన్నతోపులాట జరిగింది. ప్రాణభయంతో ప్రయాణికులు ఒక్కసారిగా పరుగులు తీశారు. దీంతో తొక్కిసలాట జరిగి ఏకంగా 18 మంది మృతి చెందారు. వీరిలో ఇద్దరు చిన్నారులు కూడా ఉన్నారు. ప్రమాదం జరిగిన వెంటనే పోలీసులు, రైల్వే సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు. భారీ సంఖ్యలో ప్రజలు ఒకేసారి రైళ్లల్లోకి ప్రవేశిస్తున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి.
ప్రధాని మోదీ, రాజ్నాథ్ సింగ్ స్పందన
ఈ ఘటనపై ప్రధానమంత్రి నరేంద్రమోదీ, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ స్పందించారు. తొక్కిసలాట ఘటన తీవ్రంగా కలచివేసిందని, మృతుల కుటుంబాలకు సానుభూతి తెలిపారు. ప్రయాణికుల ప్రాణాలు కోల్పోవడం బాధాకరం.. గాయపడినవారు త్వరగా కోలుకోవాలి కోరుకుంటున్నామన్నారు.
దర్యాప్తునకు ఆదేశం.. కమిటీ ఏర్పాటు
రైల్వే బోర్డు ఈ ఘటనపై సమగ్ర దర్యాప్తు కోసం ఇద్దరు సభ్యుల ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేసింది. ప్రయాణికుల గుమికూడడాన్ని అదుపు చేయడంలో రైల్వే సిబ్బంది విఫలమయ్యారా? రైల్వే స్టేషన్లో అత్యధికంగా జనసమూహం పోటెత్తినప్పటికీ తగిన ముందు జాగ్రత్తలు తీసుకోలేదా? ప్లాట్ఫామ్పై ప్రయాణికుల కదలిక నియంత్రణపై రైల్వే వ్యవస్థ వైఫల్యమేనా? అనే కోణాల్లో దర్యాప్తు కొనసాగనున్నట్లు తెలుస్తోంది.








