తెలంగాణ రాష్ట్రంలో లంచాలు ఊపందుకున్నాయని, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక రాష్ట్రం లంచాలకు అడ్డాగా మారిందని గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన ఆరోపణలు చేశారు. పోలీసు అధికారులు లంచాలు తీసుకోవడం తీవ్ర కలకలం రేపిందన, రాష్ట్రంలో వ్యవస్థలను దెబ్బతీస్తుందన్నారు. పోలీస్ వ్యవస్థలో లంచాల వసూళ్లపై బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ ఓ విడుదల చేస్తూ అందులో సంచలన ఆరోపణలు చేశారు.
కాంట్రవర్సీకి కారణమైన ఆడియో క్లిప్
కరీంనగర్ జిల్లా జమ్మికుంట పోలీసు స్టేషన్ ఇన్స్పెక్టర్ రవికుమార్కు సంబంధించిన ఓ ఆడియో క్లిప్ వైరల్ అవుతోంది. ఇందులో, ఒక కేసులో 3 లక్షల లంచం తీసుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఇన్స్పెక్టర్ బాత్రూంలో డబ్బులు దాచినట్లు బాధితుడు చెప్పాడని, సీసీటీవీ ఫుటేజ్ను చెక్ చేయాలని కోరుతున్నట్లు రాజాసింగ్ వెల్లడించారు.
గోషామహల్లోనూ లంచాల వేధింపు
రాజాసింగ్ తెలిపిన వివరాల ప్రకారం, గోషామహల్ పరిధిలోని షాహినాత్ గంజ్ పోలీసు స్టేషన్ సీఐ ఏ. బాబు చౌహాన్పై సైతం లంచాల ఆరోపణలున్నాయి. ఓ కేసు నుంచి పేరు తొలగించేందుకు రూ. 1.5 లక్షలు డిమాండ్ చేయగా, రూ. 50 వేల డీల్ ఫైనల్ అయింది. లంచం తీసుకుంటూ సీఐ ఏసీబీకి పట్టుబడ్డారు.
రాజాసింగ్ సూచనలు
పోలీస్ ఛాంబర్లలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలి. లంచాలు తీసుకుంటున్న అధికారులను విధుల్లోంచి పూర్తిగా తొలగించే ప్రత్యేక జీవో తీసుకురావాలి. పోలీస్ వ్యవస్థలో లంచాల మాఫియాను నిర్మూలించేందుకు కఠిన చర్యలు చేపట్టాలని రాజాసింగ్ కోరారు.
రాజాసింగ్ చేసిన ఈ ఆరోపణలు, సూచనలు రాష్ట్రంలో కొత్త చర్చకు దారితీశాయి. పోలీసు వ్యవస్థను పరిరక్షించకుండా ఇలా లంచాల కోసం వేధించడంపై ప్రజల్లో అసహనం పెరిగిపోతోందని, నమ్మకం సన్నగిల్లుతోందని, లంచాలు తీసుకునే అధికారులపై కఠిన చర్యలు చేపట్టడం ద్వారా ప్రజల నమ్మకాన్ని పెంచడం ముఖ్యమని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.