తెలంగాణ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్న వేళ, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ (KTR) తీవ్ర వ్యాఖ్యలు చేశారు. శనివారం సిరిసిల్ల పర్యటనలో భాగంగా ఆయన బీఆర్ఎస్ క్యాడర్కు కీలక సూచనలు చేశారు. మేడిగడ్డ బ్యారేజ్ (Medigadda Barrage) విషయంలో కాంగ్రెస్ నాయకులు దొంగచాటుగా కొన్ని ప్రయత్నాలు చేస్తున్నారని అనుమానం వ్యక్తం చేశారు. ‘పర్రె మేడిగడ్డకు పడలే.. రేవంత్ పుర్రెకు పడ్డది’ అని సెటైర్లు పేల్చారు.
ఈ ఏడాది జరిగే స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో, బీఆర్ఎస్ నాయకులు ప్రేక్షకపాత్రకు పరిమితం కావొద్దు, కేసులైనా భయపడొద్దు అని సూచించారు. బాక్సింగ్లో కిందపడ్డా నిలబడి కొట్లాడేటోడే వీరుడు అని కేటీఆర్ అన్నారు. చిట్టినాయుడు (రేవంత్రెడ్డి) ఏం పీకలేడు అంటూ కేటీఆర్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. చిల్లర మిల్లర రాతలు రాయించేవారినీ వదిలిపెట్టమని హెచ్చరించారు.
విభజన తరువాత బీఆర్ఎస్ ప్రభుత్వానికి 369 కోట్ల రెవెన్యూ మిగులుతో అప్పజెప్పితే.. బీఆర్ఎస్ దిగిపోయేనాటికి రూ.5,564 కోట్ల మిగులుతో కాంగ్రెస్కు అప్పగించామని చెప్పారు. రెవెన్యూ మిగులు విషయంలో ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి తలోమాట మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. పదేళ్లలో బీఆర్ఎస్ రూ.4.17 లక్షల కోట్ల అప్పు చేస్తే.. కాంగ్రెస్ ఒక ఏడాదిలో రూ.1.37 లక్షల కోట్ల అప్పుచేసిందన్నారు. తెలంగాణ పైసలన్నీ కాంగ్రెస్ ప్రభుత్వం ఢిల్లీకి పంపుతుందని, తెలంగాణ ఢిల్లీకి ఏటీఎంలా మారిపోయిందని సంచలన వ్యాఖ్యలు చేశారు.
హైడ్రా పేరుతో పేదల పొట్ట కొట్టడం తప్ప ప్రభుత్వం ఏం చేసిందని కేటీఆర్ ప్రశ్నించారు. కొడంగల్ భూములివ్వని కేసులో కూడా తనను ఇరికించే యత్నం సీఎం రేవంత్ చేశాడని, వాళ్లు కేసుల గురించి ఆలోచిస్తే.. బీఆర్ఎస్ ప్రజల గురించి ఆలోచన చేస్తోందన్నారు. త్వరలో సభ్యత్వ నమోదు ప్రారంభించి బూత్ కమిటీ నుంచి రాష్ట్ర కమిటీలు నిర్మాణం చేసుకుందామన్నారు.