- విశాఖ స్టీల్ ప్లాంట్ పరిరక్షణ పోరాట కమిటీ చైర్మన్ సీహెచ్ నరసింగరావు
ప్రధానమంత్రి నరేంద్రమోదీ విశాఖ పర్యటన సందర్భంగా విశాఖ స్టీల్ ప్లాంట్ పరిరక్షణ పోరాట కమిటీ చైర్మన్ సీహెచ్ నరసింగరావు పలు డిమాండ్లను లేవనెత్తారు. స్టీల్ ప్లాంట్కు సొంత గనులు కేటాయించాలని మనం డిమాండ్ చేస్తున్నామని ఆయన చెప్పారు. దేశంలోని అన్ని స్టీల్ ప్లాంట్లకు సొంత గనులు ఉన్నాయని, అన్ని ప్లాంట్లతో సమానంగా విశాఖ ప్లాంట్కు కూడా గనులు కేటాయించి వారి చిత్తశుద్ధిని నిరూపించుకోవాల్సిన అవసరం ఉందని నరసింగరావు చెప్పారు.
మిట్టల్ స్టీల్ ప్లాంట్ ఇంకా పుట్టక ముందే గనులు ఇవ్వాలని చూస్తున్నారని, కానీ ప్రస్తుతం రన్నింగ్లో ఉన్న స్టీల్ ప్లాంట్లకు గనులు ఇవ్వాలని ప్రధాని నిర్దిష్టంగా నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. కేంద్రం ఏపీ పట్ల వివక్షతో వ్యవహరిస్తుందని, ఇది ఆంధ్ర రాష్ట్రానికి అన్యాయం చేస్తున్నట్లేనని చెప్పారు.
స్టీల్ ప్లాంట్లో 4,000 మంది కాంట్రాక్ట్ కార్మికులను తొలగించే కుట్ర జరుగుతుదని ఆందోళన వ్యక్తం చేశారు. దీన్ని తప్పకుండా అడ్డుకుంటామని, మిట్టల్ స్టీల్ ప్లాంట్ కు ఇచ్చిన ప్రాధాన్యత వైజాగ్ స్టీల్ కు ఎందుకు ఇవ్వరు? అని ప్రశ్నించారు. వైజాగ్ స్టీల్ ప్లాంట్ 115 శాతం ఉత్పత్తి సాధించిందని, అయినప్పటికీ, జీతాలు ఇవ్వకుండా ఇబ్బందులు పెడుతున్నారని నరసింగరావు మండిపడ్డారు.
మూడు రోజులు నిరసన కార్యక్రమాలు..
విశాఖలో ఈనెల 8న ప్రధాని పర్యటన సందర్భంగా విశాఖ స్టీల్ ప్లాంట్ పరిరక్షణ పోరాట కమిటీ మూడు రోజుల పాటు నిరసన కార్యక్రమాలకు పిలుపునిచ్చింది. ఈరోజు స్టీల్ ప్లాంట్లో నల్ల బ్యాడ్జిలతో కార్మికులంతా నిరసన తెలపనున్నారు. 6వ తేదీన కుర్మాన్నపాలెం నుంచి కలెక్టరేట్ వరకు బైక్ ర్యాలీ నిర్వహించనున్నారు. 7న జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద నిరసన చేపట్టనున్నట్లు స్టీల్ ప్లాంట్ పరిరక్షణ పోరాట సమితి వెల్లడించింది.