ప్రపంచ తెలుగు సమాఖ్య 12వ ద్వైవార్షిక మహాసభలు నేటి నుంచి మూడు రోజుల పాటు హైదరాబాద్లోని హైటెక్స్ ప్రాంగణంలో అంగరంగ వైభవంగా జరగనున్నాయి. ఈ మహాసభల ద్వారా తెలుగు భాషా సంస్కృతుల ప్రాముఖ్యతను ప్రపంచవ్యాప్తంగా ప్రదర్శించనున్నారు. ఈరోజు మహాసభలను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారికంగా ప్రారంభించనున్నారు. శనివారం కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, తెలంగాణ మంత్రి సీతక్క ముఖ్య అతిథులుగా హాజరుకానున్నారు. చివరి రోజైన ఆదివారం, ముగింపు కార్యక్రమంలో మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొననున్నారు.
ఈ మహాసభల్లో 10 మందికి బిజినెస్ అఛీవర్ అవార్డులు, కంపెనీల ద్వారా సేవ- దాతృత్వ కార్యక్రమాలు చేస్తున్న వారికి సీఎస్ఆర్ అవార్డులు అందజేస్తామని సమాఖ్య అధ్యక్షురాలు ఇందిరాదత్ వెల్లడించారు. ఈసారి కొత్తగా తెలుగు ఏంజెల్స్ అనే కార్యక్రమంలో తెలుగు వారి స్టార్టప్ కంపెనీలను పరిచయం చేస్తున్నట్లు చెప్పారు. ఈ మహాసభలు తెలుగు వారందరికీ ఒక గొప్ప వేదికను అందిస్తూ, వారి ఆలోచనలను ప్రపంచానికి పరిచయం చేయనున్నాయి.