ఎన్నికల ముందు పవన్ కల్యాణ్కు పదే పదే బహిరంగ లేఖలు రాస్తూ తన అభిప్రాయాలను తెలియజేసి వార్తల్లో నిలిచిన కాపు నాయకుడు, మాజీ మంత్రి హరిరామ జోగయ్య.. తాజాగా మంత్రి నిమ్మల రామానాయుడుకు లేఖ రాశారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు నియోజకవర్గంలో 500 పడకల సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిని నిర్మించాలంటూ మంత్రి నిమ్మలకు, ఎంపీ శ్రీనివాస్ వర్మకు బహిరంగ లేఖ రాశారు.
జోగయ్య తన లేఖలో..
అభివృద్ధి అనే పదం ప్రజలకు హితం కలిగించే వసతులను అందించే విషయమే అని చెప్పారు. అభివృద్ధి అంటే కేవలం భవనాలు, పార్కులు, కళాభవనాలు కాదు.. అది రోడ్లు, సాగునీరు, మురుగు కాలువలు, త్రాగు నీరు, విద్య, మరియు ఆరోగ్య పరిరక్షణకు ప్రధాన ప్రాధాన్యత ఇవ్వడం అని అభిప్రాయపడ్డారు.
ప్రస్తుత ప్రభుత్వం ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తూ, పలు ప్రాజెక్టులకు అత్యధిక నిధులు కేటాయిస్తున్నట్లు హరిరామ జోగయ్య పేర్కొన్నారు. ఆయన అభిప్రాయం ప్రకారం, రాష్ట్ర అభివృద్ధి అంతా ఒకే ప్రాంతంలో కేంద్రీకరించడం కంటే, అన్ని ప్రాంతాలు సమానంగా అభివృద్ధి చెందాలనే లక్ష్యం కావాలన్నారు.
500 పడకల ఆస్పత్రి అవసరం
పాలకొల్లు నియోజకవర్గం ప్రజలకు అత్యవసరంగా ఒక సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి అవసరం ఉందని ఆయన తెలిపారు. హైదరాబాద్ లేదా విశాఖపట్నం వెళ్లాల్సిన అవసరం లేకుండా, ప్రతి జిల్లాలో సమర్థవంతమైన వైద్య సేవలు అందుబాటులో ఉండాలని సూచించారు.
పాలకొల్లులో ప్రస్తుతం వంద పడకల ఆస్పత్రి, మెడికల్ కాలేజీ నిర్మాణ దశలో ఉన్నా, 500 పడకల సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి ఏర్పాటు చేయడం ఎంతో కీలకమని హరిరామ జోగయ్య అభిప్రాయపడ్డారు.








