జనసేన పార్టీ కార్యకర్త, వినుత కోట డ్రైవర్ రాయుడు హత్య కేసు గత రెండ్రోజులుగా కీలక మలుపులు తిరుగుతోంది. అయితే ఈసారి జనసేన మాజీ ఇన్చార్జ్ భర్త అనేక కీలక విషయాలను వెల్లడిస్తూ విడుదల చేసిన వీడియో సంచలనంగా మారింది. తమను అనవసరంగా హత్య కేసులో ఇరికించారని ఆరోపించిన కోట చంద్రబాబు, ఇది పూర్తిగా రాజకీయ కుట్రేనని స్పష్టం చేశారు. బలమైన రాజకీయ నాయకురాలిగా ఎదుగుతున్న వినుత కోటను అడ్డుకోవడానికే ఈ వ్యవహారం జరిగిందని చంద్రబాబు ఆరోపించారు.
కోట చంద్రబాబు మాట్లాడుతూ.. తమ పేర్లు ఎఫ్ఐఆర్లో చేర్చకముందే చెన్నై పోలీసులు ప్రెస్మీట్ పెట్టడం, శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి ముందుగానే రిమాండ్ రిపోర్ట్ బయట పెట్టి మీడియాతో మాట్లాడటం వెనుక స్పష్టమైన స్కెచ్ ఉందని అనుమానం వ్యక్తం చేశారు. అందుకు సంబంధించిన ఆధారాలు సైతం తమ వద్ద ఉన్నాయని, వినుత కోట త్వరలోనే మీడియా ముందు అన్ని వాస్తవాలను వెల్లడిస్తుందని సంచలన వ్యాఖ్యలు చేశారు. చెన్నైలోని సెవెన్ వెల్స్ పోలీస్ స్టేషన్ వద్ద మంతనాలు జరిగాయని, ఇందులో శ్రీకాళహస్తి వన్టౌన్ సీఐ గోపి పాత్ర కూడా ఉందని ఆరోపించారు.
చెన్నై పోలీసులకంటే ముందే ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి రిమాండ్ రిపోర్ట్ను ఎలా బయటపెట్టారు?, మా అరెస్టుకు ముందు శ్రీకాళహస్తి సీఐ గోపి ఎందుకు తమిళనాడు పోలీసులను కలిశారు? ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి అన్ని వ్యాపారాలు చెన్నై కేంద్రంగా చేస్తూ మాపై కక్షసాధింపు చర్యలు చేశారు. జూన్ 25న అపోలో ఆస్పత్రిలో సొంత మామ వైద్యం నిమిత్తం చేరారు.. అపోలో ఆస్పత్రిలో పార్కింగ్ లో సిసి కెమెరాలు ఆధారాలు ఉన్నాయి.
తన రాజకీయ ప్రత్యర్థి వినుత కోట ఎదుగుదలను చూసి ఓర్వలేక ఎమ్మెల్యే బొజ్జల సుధీర్రెడ్డి ఇదంతా చేశాడని చంద్రబాబు ఆరోపించారు. తాము రిమాండ్కు వెళ్లకముందే ఎమ్మెల్యే బొజ్జల మీడియా ముందుకు వచ్చి డ్రైవర్ రాయుడు తన తమ్ముడు, అంత్యక్రియలుకు హాజరు అవుతామని చెప్పారని, అసలు మా డ్రైవర్ గురించి ఎమ్మెల్యేకు ఏం సంబంధం, ఎలా తెలుసు అని చంద్రబాబు ప్రశ్నించారు. రాయుడు హత్యలో ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి పాత్రపై రాష్ట్ర ప్రభుత్వం సిట్ విచారణ జరిపించాలని, బొజ్జల సుధీర్ రెడ్డి పాత్ర ఉందని ప్రజలు అందరికి తెలుసు.. ఎందుకు విచారణ చేపట్టరు అని ప్రశ్నించారు. ఈ కేసులో సిట్ విచారణ, సీబీఐ విచారణ జరిపించాలని చంద్రబాబు డిమాండ్ చేశారు. న్యాయం తప్పకుండా గెలుస్తుందని “సత్యమేవ జయతే” అంటూ చంద్రబాబు తన సెల్ఫీ వీడియోను ముగించారు.








