వైఎస్సార్ కడప జిల్లాలో (YSR Kadapa District) దారుణ ఘటన చోటుచేసుకుంది. పులివెందులలో (Pulivendula) 8వ తరగతి చదువుతున్న మైనర్ బాలిక (Minor Girl) ఆస్పత్రిలో ప్రసవించడంతో కలకలం రేగింది. మైనర్ బాలిక పురిటి నొప్పులతో ఆస్పత్రిలో చేరి, బిడ్డకు జన్మనివ్వడం అందరినీ షాక్కు గురిచేస్తోంది.
వివరాల్లోకి వెళితే.. వేంపల్లి ప్రభుత్వ బాలికల పాఠశాలలో (Vempalli Government Girls School) 8వ తరగతి చదువుతున్న బాలిక (15) గర్భం దాల్చింది. ఈ విషయాన్ని కుటుంబ సభ్యులు గోప్యంగా ఉంచినట్లు తెలుస్తోంది. గురువారం బాలికకు పురిటి నొప్పులు రావడంతో వేంపల్లిలోని ఇంటి వద్దనే ప్రసవం చేయించేందుకు ప్రయత్నాలు చేశారు.
పరిస్థితి విషమించడంతో కుటుంబ సభ్యులు బాలికను పులివెందుల ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి (Area Hospital) తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మైనర్ బాలిక ఆడ శిశువుకు జన్మనిచ్చింది. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు ఆసుపత్రికి చేరుకుని కుటుంబ సభ్యులను విచారిస్తున్నారు. మైనర్ బాలిక గర్భం దాల్చడానికి కారణాలు, బాధ్యులెవరు అనే అంశాలపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర ఆందోళన కలిగిస్తోంది.








