ఉత్తరప్రదేశ్ (Uttar Pradesh)లో మరో షాకింగ్ మోసం బయటపడింది. కాన్పూర్ (Kanpur)కు చెందిన దివ్యాన్షి చౌదరి (Divyanshi Chaudhary) అనే మహిళ, పెళ్లిళ్ల పేరుతో పురుషులను వలలో వేసి కోట్ల రూపాయలు దోచుకున్న ఘటన వెలుగుచూసింది. పెళ్లి కావాలనే తపనలో ఉన్నవారి మనస్తత్వాన్ని క్యాష్ చేసుకున్న ఆమె, నిత్య పెళ్లికూతురి (Serial Bride)గా మారి వరుసగా పలువురిని మోసం చేసింది. తాజాగా ఈ కేసులో పోలీసులు ఆమెను అరెస్ట్ చేయడంతో మొత్తం వ్యవహారం బయటకు వచ్చింది.
12 మందిని వలలో వేసిన దివ్యాన్షి
దివ్యాన్షి ఇప్పటి వరకు నాలుగు సార్లు పెళ్లి చేసుకుంది. అంతేకాదు, 12 మందికిపైగా పురుషులతో లవ్ అఫైర్ నడిపి, పెళ్లి పేరిట భారీగా డబ్బు వసూలు చేసింది. వివాహం చేసుకొని కొంతకాలం గడిపిన తర్వాత చిన్నచిన్న గొడవలను పెంచి, విడాకుల బెదిరింపులు, కేసుల పేరుతో బ్లాక్మెయిల్ చేసే రీతిలో ఆమె వ్యవహరించేది.
రూ.8 కోట్లకు పైగా లావాదేవీలు
పోలీసుల దర్యాప్తులో ఇప్పటి వరకు బయటపడ్డ మొత్తం రూ.8 కోట్లు. ఇలాంటి స్కామ్కు గురైనవారిలో పోలీసు అధికారులు, వైద్యులు, ప్రైవేట్ ఉద్యోగులు కూడా ఉన్నట్లు సమాచారం. ఆన్లైన్ మ్యాట్రిమొనీ ప్లాట్ఫారాల ద్వారా టార్గెట్లను ఎంచుకొని, వారితో సన్నిహితంగా మారి, చివరకు డబ్బు దోచుకోవడం నిత్య పెళ్లికూతురు టార్గెట్.
పోలీసుల పట్టులో ‘నిత్య పెళ్లికూతురు’
దివ్యాన్షిపై పలు బాధితులు ఫిర్యాదులు చేయడంతో పోలీసులు సోదాలు నిర్వహించి ఆమెను అరెస్ట్ చేశారు. పెళ్లి పేరుతో జరుగుతున్న మోసాలు పెరుగుతున్న నేపథ్యంలో, మ్యాట్రిమొనీ ప్లాట్ఫారాల ద్వారా పరిచయాలు చేసుకునే వారు జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలని పోలీసులు సూచిస్తున్నారు.








