తిరుపతిలోని ప్రఖ్యాత శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ (ఎస్వీ యూనివర్సిటీ)లో ర్యాగింగ్ వివాదం పెద్దఎత్తున చర్చనీయాంశంగా మారింది. సైకాలజీ విభాగంలో జరిగిన ర్యాగింగ్ ఘటన నేపథ్యంలో నలుగురు ఫస్ట్ ఇయర్ విద్యార్థినులు తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొలేక యూనివర్సిటీని విడిచిపెట్టారు.
మొదట ర్యాగింగ్ ఘటనపై ఫిర్యాదు చేసిన ఈ విద్యార్థినులు సైకాలజీ విభాగాధిపతి (HOD) ప్రొఫెసర్ విశ్వనాథ్ రెడ్డిపై కూడా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అయితే ఫిర్యాదు వెనక్కి తీసుకోవాలని తీవ్ర ఒత్తిడి తెచ్చారని, ఆ ఒత్తిళ్లు భరించలేక చివరికి వారు TCలు తీసుకొని యూనివర్సిటీ నుంచి వెళ్లిపోయారని సమాచారం.
ఈ ఘటనపై యూనివర్సిటీ పాలక మండలి సీరియస్గా స్పందించింది. ర్యాగింగ్లో పాల్గొన్న విద్యార్థులను తక్షణమే సస్పెండ్ చేసింది. అలాగే సైకాలజీ విభాగాధిపతి ప్రొఫెసర్ విశ్వనాథ్ రెడ్డిని కూడా సస్పెండ్ చేస్తూ వీసీ ఆదేశాలు జారీ చేశారు.
ఇక ఈ ఘటనపై విద్యార్థి సంఘాల నాయకులు స్పందించి యూనివర్సిటీ పరిపాలనను ప్రశ్నించగా, వారిపైనే ఎస్వీ యూనివర్సిటీ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేయడం వివాదాస్పదంగా మారింది. విద్యార్థి సంఘాలు ఈ చర్యను ఖండిస్తూ “ర్యాగింగ్ను అరికట్టాలనే ప్రయత్నం చేసిన వారిపైనే కేసులు వేయడం అన్యాయం” అని తీవ్ర ఆందోళన వ్యక్తం చేశాయి. యూనివర్సిటీలో విద్యార్థుల భద్రత, ర్యాగింగ్ నివారణ చర్యలపై అధికారులు వెంటనే సమగ్ర దర్యాప్తు చేయాలని డిమాండ్ చేస్తున్నారు.








