మొంథా తుఫాన్ ప్రభావంతో నేటికీ వణికిపోతున్న తెలుగు రాష్ట్రాలకు మరో షాకింగ్ వార్త చెప్పింది వాతావరణ శాఖ. రాబోయే రెండు రోజుల్లో తూర్పు మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనున్నట్లు వాతావరణ శాఖ ప్రకటించింది. ఈ అల్పపీడన ప్రభావంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.
వాతావరణ నివేదిక ప్రకారం, రానున్న 48 గంటల్లో కోస్తా ఆంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో చెదురుమదురు వానలు పడే అవకాశం ఉంది. ఇవాళ కొన్ని చోట్ల పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ (APSDMA) ప్రకటించింది.
అదే సమయంలో, తెలంగాణలో కూడా తేలికపాటి నుంచి మోస్తరు వానలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. రైతులు, మత్స్యకారులు వాతావరణ మార్పులపై అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.








