ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కుదిరినప్పుడల్లా ప్రశంసలతో సీఎం చంద్రబాబును ఆకాశానికి ఎత్తుతున్నారు. కూటమి గెలిచిన సమయంలో, అసెంబ్లీలో, ఎమ్మెల్యేల మీటింగ్లో ఇలా చంద్రబాబుపై తన అభిప్రాయాన్ని వ్యక్తపరుస్తూ వస్తున్నారు. తాజాగా మరోసారి చంద్రబాబును ప్రశంసించారు పవన్ కల్యాణ్.
ఆంధ్రప్రదేశ్ను టూరిస్ట్ డెస్టినేషన్గా మరింత అభివృద్ధి చేసే ప్రణాళికలో భాగంగా స్వర్ణాంధ్ర@2047 విజన్ డాక్యుమెంట్ ఆవిష్కరణ కార్యక్రమంలో పవన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు మహోన్నత నాయకుడు అని సంబోధించారు. చంద్రబాబు నాయుడు సారథ్యంలో రాష్ట్రం ప్రగతిలో దూసుకెళ్లుతోందంటూ కితాబిచ్చేశారు. ఆంధ్ర రాష్ట్రంలో పర్యాటక ప్రదేశాల పరిపూర్ణత ఎంతో ఉందని, వాటిని మరింత అభివృద్ధి చేసి ప్రపంచ వ్యాప్తంగా ఉన్న పర్యాటకులను ఆకర్షించాల్సిన అవసరం ఉందంటూ పవన్ వ్యాఖ్యనించారు.
ఆంధ్రప్రదేశ్కు ఉన్న సుందరమైన సహజ సౌందర్యాన్ని, పర్యాటక ఆకర్షణలను సమర్థవంతంగా అభివృద్ధి చేసి, రాష్ట్రాన్ని ప్రపంచం మొత్తంలో కీలక పర్యాటక కేంద్రంగా మారుస్తామంటూ పవన్ స్పష్టం చేశారు.