ఏపీ డిప్యూటీ సీఎం పవన్కల్యాణ్పై వైసీపీ అధికార ప్రతినిధి శ్యామల తీవ్ర వ్యాఖ్యలు చేశారు. గుంటూరులో నిర్వహించిన రైతుకు అండగా వైసీపీ నిరసన కార్యక్రమంలో పాల్గొని ప్రసంగించిన శ్యామల.. కూటమి ప్రభుత్వ వైఫల్యాలను తీవ్రంగా విమర్శించారు. రైతుల సమస్యలు పెరుగుతున్నాయని, కూటమి ప్రభుత్వం ఆరు నెలలు పూర్తయినా, రైతుల సంక్షేమానికి సంబంధించి ఏ చర్యలు చేపట్టలేదని, పెట్టుబడి సాయం గురించి కూడా చర్చించలేదన్నారు.
తడిసిన ధాన్యం – ప్రభుత్వ నిర్లక్ష్యం
అకాల వర్షాలకు ధాన్యం తడిసి పోవడం వల్ల రైతులు తీవ్రంగా నష్టపోయారని, దీనికి పరిహారం అందించడం ఆ ప్రభుత్వం బాధ్యతగా భావించకపోవడం దారుణమని శ్యామల అన్నారు. తడిసిన ధాన్యంతో పాటు రంగు మారిన ధాన్యాన్ని కూడా ప్రభుత్వం వెంటనే కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు.
పవన్ మాటలపై ప్రశ్నలు
రైతులను రాజులుగా మార్చుతానని చెప్పిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇప్పుడు మౌనంగా ఉండటం ఏమిటని శ్యామల ప్రశ్నించారు. రైతులకు ఇచ్చిన మాట ప్రకారం, పవన్ కల్యాణ్ వెంటనే చర్యలు తీసుకోవాలి. రైతులకు అండగా నిలబడటం ఆయన బాధ్యత అని ఆమె అభిప్రాయపడ్డారు.
వైసీపీ ఉద్యమాలు – రైతులకు మద్దతు
రాష్ట్ర వ్యాప్తంగా అన్నదాతల కోసం వైసీపీ పెద్ద ఎత్తున పోరాట కార్యక్రమాలను చేపట్టింది. ప్రతి జిల్లాలోనూ రైతుల సమస్యలను ప్రాధాన్యతగా తీసుకుని, ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేందుకు ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయని వైసీపీ స్పష్టం చేసింది.