తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం (Telangana Congress Government)లో మంత్రుల మధ్య మాటల యుద్ధం ముదురుతోంది. మంత్రి పొన్నం ప్రభాకర్ (Ponnam Prabhakar) చేసిన “దున్నపోతు” వ్యాఖ్యలపై మంత్రి అడ్లూరి లక్ష్మణ్ (Adluri Laxman) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను పుట్టిన సామాజిక వర్గాన్ని, తమ జాతిని మొత్తాన్ని అవమాన పరిచే విధంగా మంత్రి పొన్నం మాట్లాడారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
నేను మౌనంగా ఉండను.. పోరాడుతా
“నేను మంత్రి కావడం, మా వర్గంలో పుట్టడం నా తప్పా? పొన్నం ప్రభాకర్ తప్పును ఒప్పుకొని క్షమాపణ చెప్పాలి. ఆయన లాగా అహంకారంగా మాట్లాడడం నాకు రాదు, కానీ మా గౌరవం కోసం నేను మౌనంగా ఉండను,” అని లక్ష్మణ్ స్పష్టం చేశారు. మంత్రి అడ్లూరి లక్ష్మణ్ మాట్లాడుతూ.. “నేను కుర్చీలో కూర్చుంటే మంత్రి వివేక్ లేచి వెళ్లిపోతున్నారు. సహచర మంత్రిని అవమానించినా వివేక్ చూస్తూ ఊరుకున్నారు. ఇలాంటి వ్యవహారం కాంగ్రెస్ పార్టీ విలువలకు విరుద్ధం” అని మండిపడ్డారు.
కాంగ్రెస్ పెద్దలకు లేఖ
అడ్లూరి లక్ష్మణ్ ఈ ఘటనపై కాంగ్రెస్ అగ్రనేతలకు ఫిర్యాదు చేశారు. “దున్నపోతు వ్యాఖ్యలపై ఇప్పటికే మల్లికార్జున ఖర్గే, మీనాక్షి లేఖ రాశాను. రేపటికి పొన్నం ప్రభాకర్ క్షమాపణలు చెప్పాలి. లేకపోతే జరిగే పరిణామాలకు ఆయనే బాధ్యత వహించాలి,” అని హెచ్చరించారు. త్వరలో సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే, మీనాక్షి లను వ్యక్తిగతంగా కలుస్తానని, తన జాతి గౌరవాన్ని కాపాడటానికి ఏ స్థాయిలోనైనా పోరాడుతానని హెచ్చరించారు.
మంత్రి పొన్న ఖండన
సోషల్ మీడియాలో మంత్రులు పొన్నం ప్రభాకర్ వర్సెస్ అడ్లూరి వెంకట్ వ్యాఖ్యలు వైరల్గా మారాయి. మంత్రి అడ్లూరిపై దున్నపోతు అంటూ చేసిన వ్యాఖ్యలను దళిత సంఘాలు, ఎమ్మార్పీఎస్ నాయకులు ఖండించారు. అడ్లూరిని తాను ఏమీ అనలేదని, తన వ్యాఖ్యలను వక్రీకరించారని మంత్రి పొన్నం ప్రభాకర్ వాదిస్తున్నారు. దున్నపోతు అంటూ తనను కామెంట్ చేసిన పొన్నం క్షమాపణ చెబితే బాగుంటుందంటూ మంత్రి అడ్లూరి ఫోన్లో ఇతరులతో మాట్లాడుతున్న వీడియో వైరల్గా మారింది. మరి ఈ వివాదానికి ఎలా ఎండ్ కార్డ్ పడనుందో చూడాలి.







