తంబళ్లపల్లెలో నకిలీ మద్యం ముఠా.. తెర వెనుక కీలక వ్యక్తులు

తంబళ్లపల్లెలో నకిలీ మద్యం ముఠా.. తెర వెనుక కీలక వ్యక్తులు

అన్నమయ్య జిల్లా తంబళ్లపల్లె నియోజకవర్గంలో నకిలీ మద్యం తయారీ కేంద్రాన్ని ఎక్సైజ్ పోలీసులు బస్టు చేశారు. టీడీపీ నేత కట్టా సురేంద్ర నాయుడు ఆధ్వర్యంలో కల్తీ మద్యం తయారీ జరుగుతున్నట్లు గుర్తించడంతో ఆయనను అరెస్ట్ చేశారు. ఈ ఘటనలో మొత్తం 13 మందిపై కేసులు నమోదు చేశారు.

ఎక్సైజ్ అధికారుల వివరాల ప్రకారం.. టిడిపి ఇంచార్జి జయచంద్రరెడ్డి పి.ఏ. రాజేష్ ములకల చెరువులో రాక్ స్టార్ మద్యం దుకాణం నడుపుతూ కల్తీ మద్యం వ్యాపారం చేస్తున్నట్లు తేలింది. ఈ ముఠా అన్నమయ్య జిల్లా, చిత్తూరు, పుట్టపర్తి, అనంతపురం, తిరుపతి, కడప జిల్లాలతో పాటు రాయలసీమ అంతటా పెద్ద ఎత్తున నకిలీ మద్యం సరఫరా చేస్తోంది. జయచంద్రారెడ్డి బావమరిది గిరిధర్ రెడ్డి సైతం ఈ ముఠాకు మద్దతు ఇస్తున్నట్లు గుర్తించారు.

ఎక్సైజ్ అధికారులు చేప‌ట్టిన ఈ ఆపరేషన్‌లో రూ.కోటి 75 లక్షల విలువ చేసే మద్యం, మిషనరీ, లిక్కర్ సీజ్ చేశారు. 35 లీటర్ల కెపాసిటీ గల 30 స్పిరిట్ క్యాన్‌లు, 42 బ్లెండ్ స్పిరిట్ క్యాన్‌లు, 15,224 రెడీ బాటిల్స్ స్వాధీనం చేసుకున్నారు. కేరళ మాల్టెడ్ విస్కీ, బెంగుళూరు బ్రాందీ, ఓల్డ్ అడ్మిరల్, రాయల్ లాన్సర్ వంటి ఏడు రకాల నకిలీ బ్రాండ్లను ఈ ముఠా తయారు చేసినట్లు అధికారులు తెలిపారు. అంతేకాకుండా మూడు మ్యాన్యువల్ మెషిన్లు, 10 వేల ఖాళీ బాటిల్స్, ప్రత్యేక బాక్సులు కూడా సీజ్ చేశారు.

ఈ ఘటనలో మొత్తం 9 మందిని గుర్తించారు. వీరిలో నలుగురు తమిళనాడువారు, ఇద్దరు ఒడిశా వారు. విజయవాడకు చెందిన జనార్ధన్ రావు కీలకంగా వ్యవహరించగా, నర్సీపట్నం వ్యక్తి డ్రైవర్‌గా ఉన్నాడు. గోదాం స్థల యజమాని లక్ష్మీనారాయణ ప్రస్తుతం బెంగుళూరులో ఉండగా, ఆయన లీజ్‌కు ఇచ్చిన ప్రాంగణాన్ని రామ్మోహన్ అనే వ్యక్తి సబ్‌లీజ్ ఇచ్చి నకిలీ మద్యం తయారీకి వినియోగించినట్లు తేలింది.

Join WhatsApp

Join Now

Leave a Comment